29వ రాష్ట్రం, రైతు ఆత్మహత్యల్లో రెండో స్థానం: కెసిఆర్కు ఎర్రబెల్లి బహిరంగ లేఖ
హైదరాబాద్: తెలంగాణలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలపై తెలుగుదేశం తెలంగాణ నేత ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు మంగళవారంనాడు బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు పరామర్శించడం లేదని ఆయన ప్రశ్నించారు. తాను రాసిన బహిరంగ లేఖకు రాష్ట్రంలో ఇప్పటి వరకు ఆత్మహత్య చేసుకున్న 1325 మంది రైతుల జాబితాను పంపించారు.
కొత్త రాష్ట్రం ఏర్పడిన తరువాత బంగారు తెలంగాణగా మారుతుందని అందరూ ఆశించారని, అయితే తెలంగాణ ఇప్పుడు రైతుల ఆత్మహత్యల తెలంగాణగా మారిందని అన్నారు. రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు భారీగా రాయితీలు ఇస్తున్నారు కానీ, రైతుల ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఏమాత్రం పట్టించుకోకపోవడం దారుణమన్నారు.
ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకిచ్చే పరిహారాన్ని 6 లక్షలుగా ఇటీవలి మంత్రివర్గ సమావేశంలో ప్రకటించిన ప్రభుత్వం ఆ పరిహారాన్ని ఇప్పటి నుంచి కాకుండా తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఆత్మహత్య చేసుకున్న బాధితులందరికీ వర్తింప చేయాలని ఎర్రబెల్లి తన లేఖలో ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు.
ప్రైవేట్ అప్పులపై మారిటోరియం విధించాలని, బ్యాంకుల నుంచి రైతులు తీసుకున్న రుణాలను ఒకే సమయంలో మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. దీంతోపాటుగా పంటల ధరలు పడిపోయినప్పుడు రైతులను ఆదుకునేందుకు మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ పేరుతో పంట గిట్టుబాటు ధర కోసం వెయ్యి కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు.
ఈ విషయాలను బుధవారం నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని, ఇలోపు ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపై స్పందించి నిర్ణయం తీసుకోవాలని దయాకర్ రావు కోరారు.