రేవంత్ రెడ్డికి ఈటల ప్యాకేజీ-ఇద్దరి మధ్య సీక్రెట్ మీటింగ్-బీజేపీకి మస్కా-కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు
మాజీ మంత్రి ఈటల రాజేందర్పై టీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. హుజురాబాద్ ఉపఎన్నికలో తనకు మద్దతు కోరుతూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఈటల రాజేందర్ ప్యాకేజీ ఇచ్చారని ఆరోపించారు. ఈటల-రేవంత్ కుమ్మక్కయ్యారని.. ఇద్దరి మధ్య రహస్య సమావేశాలు జరుగుతున్నాయని ఆరోపించారు. గెస్ట్ హౌస్లలో,ఫాంహౌస్లలో ఇద్దరూ సమావేశమవుతున్నారని ఆరోపించారు. అంతేకాదు,ఉపఎన్నిక తర్వాత ఈటల రాజేందర్ కాంగ్రెస్ గూటికి చేరుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

రేవంత్-ఈటల కుమ్మక్కయ్యారు... : కౌశిక్ రెడ్డి
ఈటల-రేవంత్ ఒక్కటైన విషయం బీజేపీ శ్రేణులు గమనించాలని కౌశిక్ రెడ్డి అన్నారు. ఈటల తన ప్రెస్మీట్లో ఎక్కడా బీజేపీ గురించి మాట్లాడట్లేదన్నారు. నిన్నటి ప్రెస్మీట్లో ఈటల కాంగ్రెస్ను ఎత్తుకున్నాడని... ఎక్కడా బీజేపీ గురించి మాట్లాడలేదని అన్నారు. అటు రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడో సభలు పెట్టి ఏదో చేస్తానని చెబుతున్నాడు తప్ప.. హుజురాబాద్కు మాత్రం రావట్లేదన్నారు. కనీసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకత్వం కూడా ఇప్పటివరకూ హుజురాబాద్కు వచ్చింది లేదన్నారు.కాంగ్రెస్ సీనియర్లు జీవన్ రెడ్డి,శ్రీధర్ బాబు,పొన్నం ప్రభాకర్... ఎవరూ హుజురాబాద్ వైపు చూడట్లేదన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హుజురాబాద్లో ఈటలదే గెలుపని పదేపదే చెబుతున్నారన్నారు. దీన్నిబట్టి ఈటల,రేవంత్ కుమ్మక్కయ్యారనే విషయం అర్థం చేసుకోవాలన్నారు.

దేశ చరిత్రలో తొలిసారి ఇలా : కౌశిక్ రెడ్డి
అసలు ఈటల రాజేందర్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడా.. లేక కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడా... క్లారిటీ ఇవ్వాలని కౌశిక్ రెడ్డి ఎద్దేవా చేశారు.హుజురాబాద్ ప్రజలు ఈటలకు రాజకీయంగా ఘోరి కట్టడానికి సిద్దమయ్యారని పేర్కొన్నారు. ఈటల-రేవంత్ రహస్యంగా కలుస్తున్నారనే విషయం కాంగ్రెస్లోని పాత మిత్రుల ద్వారా తనకు తెలుస్తోందన్నారు. ఈ దేశ చరిత్రలో కాంగ్రెస్-బీజేపీ కలిసిన దాఖలా ఎక్కడా లేదని... మొదటిసారి ఈ రెండు పార్టీలు కలిసి చరిత్ర సృష్టిస్తున్నారని విమర్శించారు

ఈటలకు దమ్ముంటే ఈ సవాల్ స్వీకరించాలి : కౌశిక్ రెడ్డి
ఈటల రాజేందర్కు దమ్ము,ధైర్యం ఉంటే తన సవాల్ స్వీకరించాలన్నారు. ఇల్లందకుంట దేవాలయం వద్దకు వచ్చి హుజురాబాద్ నియోజకవర్గంలో ఇప్పటివరకూ ఏం అభివృద్ది చేశాడో ఈటల చెప్పాలన్నారు.నియోజకవర్గంలో ఒక్కరికంటే ఒక్కరికి కూడా డబుల్ బెడ్ రూమ్ ఇచ్చి గృహ ప్రవేశం చేయించలేదన్నారు. ఒకవేళ ఎవరైనా గృహ ప్రవేశం చేసినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. పక్కనే ఉన్న మంత్రి హరీశ్ రావు నియోజకవర్గంలో 4వేల మందికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చారని... అందరూ గృహ ప్రవేశం కూడా చేశారని చెప్పారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్,స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గాల్లోనూ 4వేల చొప్పున డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి లబ్దిదారులతో గృహ ప్రవేశం చేయించారని పేర్కొన్నారు. హుజురాబాద్ బిడ్డలు ఏ పాపం చేశారని... వారికి ఇళ్లు కేటాయించలేదన్నారు.
Recommended Video

హుజురాబాద్కు ఈటల చేసిందేంటి : కౌశిక్ రెడ్డి
బీజేపీ పాలనలో పెట్రలో రూ.106,డీజిల్ రూ.100 దాటిందని కౌశిక్ రెడ్డి అన్నారు. ఓవైపు టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు రూపంలో డబ్బులు ఇస్తుంటే... మరోవైపు బీజేపీ వాటిని లాగేసుకుంటోందని విమర్శించారు. గతంలో ఎకరా పొలం ట్రాక్టర్తో దున్నేందుకు రూ.3వేలు అయితే... పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలతో ఇప్పుడది రూ.6వేలకు చేరిందన్నారు. మంత్రి హరీశ్ రావు మాటలకు ఈటల ఉలిక్కిపడుతున్నారని విమర్శించారు. ఇటీవల పలు గ్రామాల్లో ఈటల కుట్టు మిషన్లు,ఇంటికి రూ.5వేలు చొప్పున పంపిణీ చేశారని అన్నారు. ఈటల ఆరోగ్యమంత్రిగా ఉండి కూడా తన సొంత నియోజకవర్గంలోని వీణవంక ఆస్పత్రిని అభివృద్ది చేయలేదన్నారు. పైగా 24 గంటలు నడిచే ఆస్పత్రిని పీహెచ్సీగా మార్చారని విమర్శించారు. గతంలో ప్రవీణ్ యాదవ్ అనే తెలంగాణ ఉద్యమకారుడిని,పలువురు స్థానిక ప్రజాప్రతినిధులను ఈటల అధికార బలంతో చిత్రహింసలకు గురిచేశాడని ఆరోపించారు. వారిపై పోలీసులతో థర్డ్ డిగ్రీ ప్రయోగించేలా చేశాడన్నారు.హుజురాబాద్లో డిపాజిట్ కూడా వస్తుందో రాదోనని ఈటలకు భయం పట్టుకుందన్నారు.

గెలుపు తనదేనన్న ఈటల...
టీఆర్ఎస్ ఎన్ని విమర్శలు,ఆరోపణలు,కుట్రలు చేసినా హుజురాబాద్లో గెలుపు తనదేనని ఈటల ధీమాగా చెబుతున్నారు.నియోజకవర్గ ప్రజలకు కేసీఆర్ ఎన్ని ఇస్తున్నా.. వారు తన వెంటే ఉన్నారని అన్నారు. అందుకే సీఎంకు ఈటల అంటే ఏంటో అర్థమైందని అన్నారు. శుక్రవారం హుజూరాబాద్ మండలం రాంపూర్లోని వడ్డెర కాలనీ వాసులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పేదరికం, కన్నీళ్లు ఇంకా పోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. 18 ఏళ్లు కేసీఆర్ అడుగు జాడల్లో నడిచినప్పుడు తమ్ముడు అని తనను సంబోధించాడని.. అలాంటిది ఇప్పుడు తాను దెయ్యం ఎలా అయ్యానని ప్రశ్నించారు.

ఈటల విమర్శలపై హరీశ్ రావు రియాక్షన్
సీఎం సీటుకు ఎసరు పెట్టేందుకు ప్రయత్నించాడంటూ ఈటల తనపై చేసిన ఆరోపణలపై మంత్రి హరీశ్ రావు స్పందించారు. ఆ వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. హుజురాబాద్లో ఈటలకు ఓటమి భయం పట్టుకుందని... అందుకే తనపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు.ఇకనైనా చౌకబారు విమర్శలు మానుకుని హుజురాబాద్లో ఏం అభివృద్ది చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. హుజురాబాద్కు మెడికల్ కాలేజీ రావాలనో... లేక హుజురాబాద్ను జిల్లా చేయమనో... లేక మరో దానికోసమే ఈటల రాజీనామా చేయలేదన్నారు. కేవలం తన వ్యక్తిగత ప్రయోజనం కోసం రాజీనామా చేశారన్నారు. కాబట్టి మళ్లీ ఈటల గెలిచినా ఆయనకే వ్యక్తిగతంగా లాభం జరుగుతుంది తప్ప ప్రజలకు ఏం ఒరగదని అన్నారు. వ్యక్తి ప్రయోజనం ముఖ్యమా వ్యవస్థ ప్రయోజనం ముఖ్యమా ప్రజలే ఆలోచించుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications