తెలంగాణా విమోచనా దినం అధికారికంగా జరపాలని మెలిక పెట్టి కేసీఆర్ టార్గెట్ గా ఈటల రాజేందర్ సంచలనం
బిజెపి నేత ఈటల రాజేందర్ తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఇరకాటంలో పెట్టే పనిలో పడ్డారు. సెప్టెంబర్ 17న అధికారికంగా తెలంగాణ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరపాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. చాలా కాలంగా సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినంగా జరపాలని, కెసిఆర్ అధికారికంగా దీనిని నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా మరోమారు సెప్టెంబర్ 17 పై మెలిక పెట్టి సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్నారు ఈటల రాజేందర్.

స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోలేని ఏకైక జాతి తెలంగాణ జాతి
ప్రపంచంలో స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోలేని ఏకైక జాతి తెలంగాణ జాతి అని అభిప్రాయపడిన ఈటల రాజేందర్ నాడు నైజాం నుండి విముక్తి సాధించిన హైదరాబాదులో భాగాలుగా ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకలలో విలీనమైన ప్రాంతాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయని, మనం మాత్రం జరుపుకోకపోవడం అవమానకరమని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించిన ఆ రోజును అధికారికంగా గుర్తు చేసుకోవాలని ఈటల స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వం అధికారికంగా జరపకపోయినా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయాలతో పాటుగా, తెలంగాణ భవన్ పైన జాతీయ జెండాను ఎగురవేసినట్లుగా పేర్కొన్న ఈటల అధికారికంగా జరుపుకోవాల్సిన అవసరాన్ని పేర్కొన్నారు. గతంలో అసెంబ్లీ వేదికగా తాను సెప్టెంబర్ 17 ను అధికారికంగా జరుపుకోవాలని డిమాండ్ చేశారని, ఇందుకు సీఎం కేసీఆర్ కూడా తనతో ఏకీభవించి మాట్లాడారని, కానీ ఇప్పుడు ఎందుకు నోరు విప్పటం లేదో చెప్పాలని ఈటల రాజేందర్ ప్రశ్నించారు.

బీజేపీ తరపున సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు
ఇక బీజేపీ తరపున వాడవాడలా సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించాలని పిలుపునిచ్చారు ఈటల రాజేందర్. మాటలతో మాయ చేసి,మోసం చేసే సంస్కృతి తమది కాదన్న ఈటల బరిగీసి కొట్లాడే సంస్కృతి తెలంగాణ ప్రజలది అని తేల్చి చెప్పారు. దేశానికి చైతన్యాన్ని అందించింది తెలంగాణ గడ్డ అని, తెలంగాణ బిడ్డలకు స్ఫూర్తిప్రదాతలుగా చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య నిలిచారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సాగిన ఉద్యమాలు వందేమాతర ఉద్యమం, గ్రంధాలయ ఉద్యమం, తెలంగాణా సాయుధ పోరాటం వరకు ఏ ఉద్యమమైనా అణచివేతకు, దోపిడీకి, అన్యాయాలకు వ్యతిరేకంగా జరిగినవని ఈటల రాజేందర్ గుర్తుచేశారు

తెలంగాణ రాజ్యంలో పాలన మళ్లీ ప్రజలను భయపెట్టి, అణచివేసే ప్రయత్నం చేస్తోందన్న ఈటల
తెలంగాణ చరిత్రను పరిశీలిస్తే పోరాడే వారికి, దుర్మార్గాలను ఎదిరించే వారికే ఈ గడ్డ అండగా ఉందని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. తెలంగాణ సమాజంలో ఈ తత్వం ఇప్పటికీ ప్రజల్లో ఉందని, తెలంగాణ గడ్డ మీద అమరత్వం, చైతన్యం దాగివుందని ఈటల రాజేందర్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు తెలంగాణ రాజ్యంలో పాలన మళ్లీ ప్రజలను భయపెట్టి, అణచివేసే ప్రయత్నం చేస్తోందని, అనేక రకాలుగా ప్రలోభ పెడుతోందని పేర్కొన్న ఈటల వీటి మధ్య పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెనుగులాడుతూ ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మళ్ళీ అరాచక పాలన సాగుతుందని ఈటల రాజేందర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

ప్రతీకారం తీర్చుకునే రోజు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు
ప్రతీకారం తీర్చుకునే రోజు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని, సైలెంటుగా ఉన్న ప్రజలు ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తున్నారని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో కులమతాలకు అతీతంగా సబ్బండ వర్గాల వారు భాగస్వాములు అయ్యారని, సకల జనులు సమ్మె చేశారని గుర్తు చేసిన ఈటల, తెలంగాణ ఉద్యమం సకల జనుల ఉద్యమమని, అన్ని పార్టీల ఉద్యమమని, ఒక పార్టీ మాత్రమే ఉద్యమం చేస్తే ఇంతమంది కదిలేవారా అంటూ ప్రశ్నించారు. రానున్న హుజురాబాద్ ఉప ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి చరమగీతం పాడుతూ ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారన్నారు.

దౌర్జన్యాలు, దుర్మార్గాలు ఇక్కడ చెల్లవన్న ఈటల
ప్రాణాలను పణంగా పెట్టి పోరాటంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ త్యాగధనులేనని , తెలంగాణ కోసం మరణించిన వారే కాదు పోరాటం చేస్తున్న ప్రతి ఒక్కరు వీరులేనని ఈటల రాజేందర్ అభిప్రాయపడ్డారు. ప్రజల చైతన్యం వల్లే కేంద్రం రాష్ట్రం ఇవ్వకుండా ఉండలేని పరిస్థితి వచ్చిందని పేర్కొన్న ఆయన తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక ప్రజల దేనని బల్లగుద్ది మరీ చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పరాయి పాలన పోయి స్వపరిపాలన వచ్చినా దౌర్జన్యాలు, దురాగతాలు, దుర్మార్గాలు పేట్రేగి పోతున్నాయని పేర్కొన్న ఈటల వీటికి చెక్ పెట్టటానికి సమయం దగ్గర పడిందని చెప్పారు. ఇక దౌర్జన్యాలు, దుర్మార్గాలు ఇక్కడ చెల్లవని హుజురాబాద్ ప్రజలు చాటిచెప్ప బోతున్నారని తెలిపారు.

సీఎం పదవి నుండి దింపటమే నిజమైన ప్రతీకారం
సీఎం కేసీఆర్ అహంకారానికి కారణమైన పదవి నుండి దింపడమే నిజమైన ప్రతీకారం అంటూ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. సెప్టెంబర్ 17 వ తేదీన నిర్మల్ లో జరిగే అమిత్ షా సభకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరు కావాలని ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. గత చరిత్ర నుండి గుణపాఠాలు నేర్చుకోని వారు, అవగాహన చేసుకోలేని వారు దురాగతాలకు పాల్పడుతున్నారని మండిపడిన ఈటల ప్రజలు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. తెలంగాణా విమోచనా దినోత్సవం విషయంలో సీఎం కేసీఆర్ తీరును ప్రజలు గమనిస్తున్నారని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. కేసీఆర్ ను ఇరకాటంలో పెట్టటం కోసం ప్రతి ఆయుధాన్ని ఈటల రాజేందర్ సమర్ధంగా ఉపయోగిస్తున్నారు. మరి ఈటల సీఎం కేసీఆర్ తో చేస్తున్న పోరాటంలో ప్రజలు ఎవరి పక్షాన నిలుస్తారో.. ఎవరి మాటను నమ్ముతారో తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications