కాంగ్రెస్ గెలిచినా ముఖ్యమంత్రి అయ్యేది కెసిఆర్ నే: ఈటల రాజేందర్
తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన నేపధ్యంలో బీజేపీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో అమిత్ షా బహిరంగసభకు సంబంధించి బిజెపి సన్నాహక సమావేశాన్ని నిర్వహించింది. ఈ సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బీఆర్ఎస్ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
బీఆర్ఎస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, ప్రజల చేత ఛీత్కారం పొందిన పార్టీ బీఆర్ఎస్ అంటూ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతలు దౌర్జన్యాలు, దుర్మార్గాలు, పోలీసులను నమ్ముకున్నారని ఆయన ఆరోపించారు. ప్రతిపక్ష నేతలను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, ప్రతిపక్షాలను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, ఒకవేళ లొంగకపోతే వారిపై తప్పుడు కేసులు పెట్టి, జైలుకు పంపుతున్నారని, కెసిఆర్ పాలనకు ఇది పరాకాష్ట అని పేర్కొన్నారు.

తెలంగాణ ప్రజానీకం కేసీఆర్ ప్రభుత్వాన్ని బొంద పెట్టాలని దృఢసంకల్పంతో ఉన్నారన్న ఎమ్మెల్యే ఈటల రాజేందర్, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ను ఎదిరించి నిలిచే పార్టీ బీజేపీనే అని పేర్కొన్నారు. ప్రజలు కూడా అదే విశ్వాసంతో ఉన్నారని, వారి నమ్మకాన్ని నిలబెట్టే బాధ్యత బీజేపీ నాయకులపై ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండూ ఒకటే అని పేర్కొన్న ఈటల రాజేందర్, కాంగ్రెస్ మీద కేసీఆర్ ఈగ కూడా వాలనివ్వడం లేదన్నారు.
రేపు కాంగ్రెస్ పార్టీ గెలిచినా ముఖ్యమంత్రి అయ్యేది మాత్రం కెసిఆర్ నే అని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. పార్లమెంటు ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న అమిత్ షా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం లో పర్యటిస్తారని, అమిత్ షా సభను విజయవంతం చేయాలని బిజెపి కార్యకర్తలకు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో అధికారాన్ని చేపట్టడానికి, అత్యధిక పార్లమెంటు సీట్లను గెలవడంలో భాగంగా తెలంగాణాలో కేంద్ర మంత్రులు పర్యటిస్తున్నారని అన్నారు. అమిత్ షా సభను విజయవంతం చేసి ఢిల్లీ నాయకత్వానికి మరింత విశ్వాసాన్ని కల్పిద్దామని పేర్కొన్న ఈటల రాజేందర్ తెలంగాణ గడ్డ బిజెపి అడ్డా అని నిరూపిద్దామని వెల్లడించారు.












Click it and Unblock the Notifications