మహిళ పట్ల అసభ్యంగా: దొంగబాబాను చెట్టు కట్టేసి చితగ్గొట్టారు
హైదరాబాద్: మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ దొంగ బాబాను తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో ప్రజలు చితగ్గొట్టారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. బంటారం మండలం తోరుమామిడి గ్రామంలో ఈ సంఘటన జరిగింది.
ఆరు నెలల క్రితం రహీంబాబా అనే ఈ నకిలీ బాబా కర్ణాటక నుంచి తోరుమామిడి గ్రామానికి వచ్చినట్లు సమాచారం. వ్యవసాయ పొలంలో చిన్న కుటీరం వేసుకుని జాతకాలు చెబుతూ జీవనం సాగిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఓ మహిళ జాతకం చెప్పించుకోవడానికి బాబా వద్దకు వెళ్లింది.

తన భర్త మూడేళ్ల నుంచి కనిపించడం లేదని ఎక్కడున్నాడో తెలపాలని బాబాను కోరింది. అయితే, రాత్రి రావాలని చెప్పి పంపించాడు. ఆ మహిళ ఆదివారం రాత్రి తన తల్లితో కలిసి బాబా వద్దకు వెళ్లింది. తల్లిని బయట ఉంచి కూతురిని లోపలికి రమ్మన్నాడు.
లోపలికి వచ్చిన మహిళతో అతను అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని ఆమె గ్రామ ప్రజలకు తెలిపింది. దీంతో గ్రామస్థులు దొంగ స్వామిని చెట్టుకు కట్టేసి చితకబాదారు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications