విధ్వంస ఆరోపణలు: 22 మంది రైతులపై కేసులు
వీరు ఓ సంఘంగా ఏర్పడి హత్యాయత్నం చేశారని, ఆస్తి తగులబెట్టారని పోలీసులు ఎఫ్ఐఆర్లో చెప్పారు. హెటిరో పరిశ్రమ ఉద్యోగి దొమ్మాట రమణారెడ్డి ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసినట్లు తొగుట ఎస్ఐ రామకృష్ణారెడ్డి తెలిపారు. వారిపై ఐపీసీ 147 , 148, 307, 506, 435, 149 సెక్షన్ల కింద అక్రమ చొరబాట్లు, హత్యాయత్నం కేసులను నమోదు చేసినట్లు చెప్పారు. బుధవారం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ సభలో పెద్దమాసాన్పల్లితో పాటు, ఇందిరానగర్, కొండపాక మండలం సిర్సనగండ్ల, ఓదన్చెరువు, మర్పడగ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
హెటిరో పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా ధ్వజమెత్తారు. పరిశ్రమ ఏర్పాటు చేయవద్దంటూ ఆగ్రహం వ్యక్తంచే శారు. ఈ క్రమంలో కొంతమంది అక్కడ కుర్చీలను విరగ్గొట్టి తమ నిరసన తెలిపారు. పరిశ్రమను ఏర్పాటు చేయవద్దంటూ తీవ్రస్థాయిలో ప్రతిఘటించారు. ఈ నేపథ్యంలో 22 మంది రైతులపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొన్న రైతులు ఇప్పుడు కేసుల భయంతో ఆందోళన చెందుతున్నారు.
కాగా, ఈ 22మందితోపాటు విధ్వంసానికి పాల్పడిన మిగిలిన వారినీ గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని త్వరలో వారిపై కేసు నమోదు చేస్తామని పోలీసులు వెల్లడించారు. కాగా ప్రజాభిప్రాయ సేకరణలో రాజకీయనాయకులు కూడా పాల్గొని నిరసన వ్యక్తం చేశారు.