మమ్నల్ని.. మీ రాష్ట్రంలో కలపండి: కేసీఆర్కు మహారాష్ట్ర రైతుల లేఖ
ముంబై: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకానికి పక్క రాష్ట్రాల నుంచి కూడా అనూహ్య స్పందన లభిస్తోంది. రైతు బంధు పథకంతో పెట్టుబడి సాయం అందుతుండటంతో.. మమ్మల్ని కూడా తెలంగాణలో కలపండి అంటూ మహారాష్ట్ర రైతులు సీఎం చంద్రశేఖర్ రావుకు ఓ లేఖ రాశారు.
రైతు బంధు పథకంతో తమకు కూడా లబ్ది చేకూరుతుందన్న ఉద్దేశంతో మహారాష్ట్ర నాందేడ్ జిల్లా ధర్మాబాద్ తాలుకాలోని గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలంటూ అక్కడి రైతులు లేఖ రాశారు. ఈ మేరకు ధర్మాబాద్ తాలుకా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు టీఆర్ఎస్ ఎంపీ కవితను స్వయంగా కలిసి విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది.

నిజామాబాద్ లో చెక్కుల పంపిణీ చేస్తున్న ఎంపీ కవితను బాబ్లీ గ్రామ సర్పంచ్ కలిసి తమ సమస్యలను వివరించారు. ఒక రాష్ట్రంలోని గ్రామాలను మరో రాష్ట్రంలో కలపడం అంత సులువైన వ్యవహారం కానప్పటికీ.. రైతుల కోసం ప్రవేశపెట్టిన పథకాలను పొందడానికి ఇంతకంటే మార్గం లేదని ఆయన పేర్కొన్నారు.
కేవలం రైతుల కోసం ప్రవేశపెట్టిన పథకాలను చూసి మహారాష్ట్ర గ్రామాలను తెలంగాణలో కలపాలనడం అనేది ఒక అసంబద్ద చర్య అని పలువురి వాదన. కాగా, రైతును ఆదుకోవడం కోసం.. దేశంలోనే తొలిసారిగా తెలంగాణ సర్కార్ రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. పెట్టుబడి సాయం కింద ఏడాదికి ఎకరాకు రూ.8వేలు అందిస్తోంది.
Recommended Video

రైతు బంధు పథకంతో పాటు రుణమాఫీ, వ్యవసాయం కోసం 24 గంటల పాటు ఉచితంగా విద్యుత్ సరఫరా, రైతులకు రూ.5లక్షల జీవిత భీమా వంటి సౌకర్యాలు కల్పిస్తోంది.
రైతు బంధు పథకంపై విమర్శలు:
రైతు బంధు పథకంపై ప్రశంసలే కాదు విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. బడా బాబుల జేబులు నింపేందుకే ఈ పథకం ఉపయోగపడుతోందన్న విమర్శలు వస్తున్నాయి. ఎకరా, రెండకరాలు ఉన్న చిన్న సన్నకారు రైతు కంటే.. వందల ఎకరాలు ఉన్న భూస్వాములు దీనివల్ల ఎక్కువగా లాభపడుతున్నారని అంటున్నారు. అదే సమయంలో కౌలు రైతును పూర్తిగా విస్మరించడం కూడా ప్రభుత్వంపై విమర్శలకు తావిస్తోంది.












Click it and Unblock the Notifications