అటు షర్మిల..ఇటు కాంగ్రెస్: తెలంగాణలో వైఎస్సార్ ఛరిష్మా ఎవరికి సొంతం?
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ పురుడు పోసుకుంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిల.. ఇక తనకంటూ ఓ సొంత గుర్తింపును పొందారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించారు. వైఎస్సార్టీపీ అధినేత్రిగా తెలంగాణ రాజకీయాల్లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. తండ్రి ఆశయాలను సాధించడం, రాజన్న రాజ్యాన్ని మళ్లీ నెలకొల్పడమే తన లక్ష్యమని వైఎస్ షర్మిల తేల్చి చెప్పారు. సంక్షేమం.. సమానత్వం.. స్వయం సమృద్ధి.. ఈ మూడింటి కోసం శ్రమిస్తామని తేల్చి చెప్పారు.

పూర్తిస్థాయి పాలిటిక్స్ ఆమె కొత్తే గానీ..
పూర్తిస్థాయి రాజకీయాలు వైఎస్ షర్మిలకు కొత్తే అయినప్పటికీ- ఆమె కుటుంబానికి మాత్రం కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దశాబ్దాల కాలం నుంచీ షర్మిల కుటుంబం కొనసాగుతోంది. వైఎస్ కుటుంబంలో మూడోతరానికి ఆమె ప్రతీక. తాత వైఎస్ రాజారెడ్డి, తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, తల్లి వైఎస్ విజయమ్మ, అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ప్రతి తెలుగువాడికీ చిరపరిచితమే. ఆ ముగ్గురి తరువాత.. వైఎస్ షర్మిల తెలంగాణలో ఎంట్రీ ఇచ్చారు.

వైఎస్సార్ పేరు పునాదిగా..
రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం.. వైఎస్సార్ అనే మూడక్షరాలు.. ఈ రెండే వైఎస్ షర్మిల పార్టీకి పునాదులని అనడంలో సందేహాలు అక్కర్లేదు. అంతకుమించి- షర్మిలకు పెద్దగా గుర్తింపు లేదు. ఆస్తుల వ్యవహారంలో తన అన్న ఇబ్బందులను ఎదుర్కొన్నప్పుడు షర్మిల ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘ పాదయాత్ర చేశారు. ఇప్పటిదాకా ఆమె కేరీర్లో రాజకీయంగా చెప్పుకోదగ్గ అంశం అదొక్కటే. అసెంబ్లీ లేదా లోక్సభ ఎన్నికల్లో ఇప్పటిదాకా పోటీ చేయలేదు. చట్టసభల్లో అడుగు పెట్టలేదు. ఇక కొత్తగా ఓ పూర్తి స్థాయి రాజకీయ పార్టీకి అధినేత్రిగా మారారామె. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యం దిశగా అడుగులు వేస్తోన్నారు.

వైఎస్సార్ ఛరిష్మా కోసం..
తెలంగాణలో వైఎస్సార్కు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. వైఎస్సార్ తన ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాల లబ్ది పొందిన వారు ఆయనను విస్మరించట్లేదు. ఆయన ఛరిష్మా చెక్కు చెదరలేదు. అలాంటి ఓటుబ్యాంకును టార్గెట్గా చేసుకున్నారు వైఎస్ షర్మిల. జిల్లాలవారీగా వైఎస్సార్ అభిమానులతో ఆత్మీయ సమావేశాలను నిర్వహించడం దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఆయన ఛరిష్మాను ఓట్లుగా మలచుకోగలిగితేనే తన పార్టీ మనుగడ సాగిస్తుందనే విషయం అటు షర్మిలకు, ఇటు కాంగ్రెస్ పార్టీకీ తెలియనది కాదు.

పేరు ఎవరికి సొంతం..
వైఎస్సార్ను తమవాడిగా చెప్పుకొనే ప్రయత్నాలకు కాంగ్రెస్ పార్టీ తెర తీసినట్టే. వైఎస్సార్ జయంతి నాడు షర్మిల పార్టీ ప్రకటన చేయడం.. అదే రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన చిత్ర పటాలు, విగ్రహాలకు పూలమాల వేసిన నివాళి అర్పించడం యాదచ్ఛికమే అయినా ఒకరకమైన పోటీకి దారి తీసినట్టయిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. కొత్తగా బాధ్యతలను స్వీకరించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ రేవంత్ రెడ్డి స్వయానా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గాంధీభవన్లో వైఎస్సార్ చిత్ర పటానికి, పంజాగుట్టలోని విగ్రహం వద్దా నివాళి అర్పించారు.

ఏపీలో విఫలం..
వైఎస్సార్ను తమవాడిగా చెప్పుకొనే విషయంలో వైఎస్సార్టీపీ, కాంగ్రెస్ మధ్య పోటీ వాతావరణం నెలకొన్నట్టే. వైఎస్సార్ను తమ వాడిగా చిత్రీకరించడంలో ఇదివరకు ఏపీలో కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కాంగ్రెస్ను ఏపీ ప్రజలు విశ్వసించలేదు. కాంగ్రెస్ వల్లే వైఎస్సార్కు ఇంత పేరు ప్రఖ్యాతులు వచ్చాయని ఆ పార్టీ నేతలు చెప్పుకొన్నప్పటికీ.. జనం పట్టించుకోలేదు. వైఎస్సార్ అకాల మరణం తరువాత ఆయన కుటుంబంపై అకారణంగా కక్ష తీర్చుకున్నారనే అభిప్రాయం బలంగా నాటుకునిపోయింది. దానికితోడు రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారనే విమర్శలనూ కాంగ్రెస్ ఎదుర్కొంటోంది.
Recommended Video

వైఎస్సార్ అనే మూడక్షరాల పేరును పలికే అర్హత కూడా
ఈ విషయంలో వైఎస్ షర్మిల తన ఎదురుదాడిని మొదలు పెట్టేశారు కూడా. వైఎస్సార్ మీద అక్రమంగా కేసులు పెట్టారని, మరణానంతరం కూడా ఆయన పేరును ఎఫ్ఐఆర్లో చేర్చడానికి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కారణమంటూ వైఎస్ షర్మిల కౌంటర్ అటాక్ ప్రారంభించారు. వైఎస్సార్ అనే మూడక్షరాల పేరును పలికే హక్కు కూడా కాంగ్రెస్కు లేదంటూ విరుచుకుపడ్డారు. ఎఫ్ఐఆర్లో చేర్చడానికి ప్రధాన కారణమైన కాంగ్రెస్.. వైఎస్సార్ను ఎలా సొంతం చేసుకుంటుందనే సంకేతాన్ని ఆమె పరోక్షంగా ఇచ్చినట్టయింది. వైఎస్సార్ మరణానంతరం కూడా రేవంత్ రెడ్డి..టీడీపీలో ఉన్న సమయంలో ఆయనపై సంధించిన విమర్శలను గుర్తు చేస్తోన్నారు వైఎస్సార్టీపీ నాయకులు.












Click it and Unblock the Notifications