బాలానగర్ పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్: హైదరాబాద్ బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పారిశ్రామికవాడలో గల రంగారెడ్డి నగర్లో ఫ్యాన్ల కంపెనీలో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు తెలియవచ్చింది. మంటల ధాటికి భవనం మొత్తం కూలిపోయే స్థితిలో ఉంది. ఈ ప్యాక్టరీలో ఫ్యాన్ల విడిభాగాలు తయారు చేస్తారు.
ఈ సమయంలో ఏడు గ్యాస్ సిలిండర్లు పేలాయి. మూడో అంతస్తు వరకు మంటలు అంటుకున్నాయి. ఈ సమయంలో లోపల ఎనిమిది మంది ఉన్నట్లు తెలుస్తోంది. పై అంతస్తు పూర్తిగా ధ్వంసమైంది.
ఐదు అగ్నిమాపక శకటాలు కృషి చేసి మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. భారీగా మంటలు ఎగిసిపడుతుండడంతో స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురై రోడ్లమీదకు పరుగుతీశారు. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి.
ఆవాస ప్రాంతంలో ఫ్యాక్టరీలు ఉండకూడదని స్థానికులు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నివాసితుల ప్రాంతంలో ఫ్యాక్టరీలు లేకుండా చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఒంటి గంటన్నర ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగిందని, సుమారు 5 గంటలపాటు మంటలు ఎగిసిపడ్డాయని స్థానికులు చెబుతున్నారు.