అత్తాపూర్ కార్ షెడ్లో భారీ అగ్ని ప్రమాదం: దగ్ధమైన లగ్జరీ కార్లు
హైదరాబాద్: నగర శివారులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అత్తాపూర్లోని కార్ల షెడ్లో మంటలు చెలరేగాయి. జనప్రియ ఉటోపియా వద్ద షెడ్లో మంటలు భారీ ఎత్తున ఎగిసిపడ్డాయి. భారీ ఎత్తున మంటలు, పొగలు కమ్ముకోవడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి ఐదు ఫైరింజిన్లతో వచ్చి మంటలు ఆర్పివేశాయి. అగ్ని ప్రమాదంలో మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడీ వంటి లగ్జరీ కార్లతోపాటు ఇతర చిన్న కార్లు కూడా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో మొత్తంగా 15 లగ్జరీ కార్లు మంటల్లో కాలిబూడిదయ్యాయి. దీంతో కోట్లలో ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
పుడింగ్ అండ్ మింక్ పబ్ కేసులో మరో ఇద్దరి విచారణ
నగరంలో సంచలనంగా సృష్టించిన పుడింగ్ అండ్ మింక్ పబ్ కేసులో మరో ఇద్దరిని బంజారాహిల్స్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఏప్రిల్ 3వ తేదీన టాస్క్ఫోర్స్ పోలీసులు పబ్పై దాడి చేసిన సమయంలో 148 మంది ఉన్నారు. వారిలో కొంత మందికి నిందితుడు అభిషేక్తో పరిచయాలున్నట్లు గుర్తించిన పోలీసులు విచారణకు హాజరుకావాలని ముగ్గురికి నోటీసులిచ్చారు.
వారిలో రంగనాయకులు, ఈశ్వర్ ప్రసాద్ శుక్రవారం విచారణకు హాజరయ్యారు. అనారోగ్యం కారణంగా రాలేనని మరో వ్యక్తి ఆదిత్య పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రంగనాయకులు, ఈశ్వర్ ప్రసాద్కు అభిషేక్తో ఎంతకాలం నుంచి పరిచయం ఉందనే వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు.
బంజారాహిల్స్ సీఐ నాగేశ్వర్ రావు, హైదరాబాద్ నార్కోటిక్ విభాగం ఏసీపీ నర్సింగ్ రావులు ఇద్దరిని ప్రశ్నిస్తున్నారు. పబ్కు ఎన్నాళ్లుగా వెళ్తున్నారనే వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పటికే ఈ కేసులో పోలీసులు గురువారం ఇద్దరిని ప్రశ్నించారు. ఆ ఇద్దరు కూడా టోనీ డ్రగ్స్ కేసులో నిందితులుగా ఉన్నారు. ఈ ఇద్దరు కూడా పబ్కు తరచూ వెళ్తుండటంతో పాటు.. అభిషేక్తో దగ్గరి పరిచయాలున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పబ్లో 4.6 గ్రాముల కొకైన్ పట్టుబడటంతో, కొకైన్ను ఎవరు తీసుకొచ్చారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.