మూడేళ్ల తర్వాత బత్తినిసోదరుల చేపప్రసాదం పంపిణీ.. నాంపల్లి గ్రౌండ్స్ లో; ఈ తేదీల్లోనే!!
చేప ప్రసాదం పంపిణీకి సమయం ఆసన్నమైంది. మృగశిర కార్తె సందర్భంగా జూన్ 9వ తేదీ నుంచి చేప ప్రసాదాన్ని ఉచితంగా బత్తిని సోదరులు పంపిణీ చేయనున్నారు. దాదాపు మూడేళ్ళ తర్వాత చేప ప్రసాదం పంపిణీకి జూన్ నెలలో ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నారు.
తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో చేప ప్రసాదం పంపిణీ గురించి నేడు బత్తిని సోదరులు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిశారు. ఈ సందర్భంగా చేప ప్రసాదం పంపిణీకి సంబంధించి వివిధ అంశాలపై మంత్రితో చర్చించారు. బత్తిని సోదరులతో మాట్లాడిన అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రసాదం పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు చేప ప్రసాదం పంపిణీకి ప్రభుత్వ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.బత్తిని సోదరులు అందించే చేప ప్రసాదం కోసం తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా, ఇతర రాష్ట్రాల నుండి, విదేశాల నుండి కూడా లక్షలాది మంది వస్తారని ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రి తలసాని వెల్లడించారు.
ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఉచితంగా చేప ప్రసాదం పంపిణీ చేస్తారని వెల్లడించారు. చేప ప్రసాదం పంపిణీకి కావాల్సిన చేప పిల్లలను మత్స్య శాఖ ఆధ్వర్యంలో అందుబాటులో ఉంచుతామని, అన్ని శాఖల అధికారులతో ఈనెల 25వ తేదీన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు.
దాదాపు 170 ఏళ్ల నుండి బత్తిని వంశస్థులు హైదరాబాద్ లో చేప ప్రసాదాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఆస్తమా, ఉబ్బసం పేషెంట్లకు ఈ చేప ప్రసాదం ఎంతగానో రిలీఫ్ ఇస్తుంది. గత మూడు సంవత్సరాల నుంచి చేప ప్రసాదం పంపిణీ జరగడం లేదు. ఇక మూడేళ్ల తర్వాత ప్రస్తుతం చేప ప్రసాదం పంపిణీ జరగనున్న నేపథ్యంలో జనం భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు భావిస్తున్నారు. అందుకు తగిన ఏర్పాట్లను కూడా చేస్తున్నారు.












Click it and Unblock the Notifications