ఐదు మృతదేహాలు.. అనేక ట్విస్టులు: అసలేం జరిగింది?, ప్రభాకర్ రెడ్డి జీవితమిలా..
కోట్లలో షేర్ వ్యాపారం చేసే ప్రభాకర్ రెడ్డి సింగిల్ బెడ్రూం ఇంట్లో అద్దెకు ఉండడం.. ఇల్లు కూడా సాదాసీదాగా ఉండటం చర్చనీయాంశమైంది.
హైదరాబాద్/సంగారెడ్డి: ఔటర్ రింగ్ రోడ్డుపై ఐదుగురి మృతదేహాలు వెలుగుచూసిన ఘటన నగరంలో కలకలం రేపుతోంది. హత్యలా? ఆత్మహత్యలా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. షేర్ మార్కెట్ నష్టాలే ఈ పరిస్థితులకు దారితీశాయా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
షేర్ మార్కెట్లో కోట్ల కొద్దీ నష్టపోయిన ప్రభాకర్ రెడ్డే మిగతా నలుగురిని హత్య చేసి.. ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడా? అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఇందుకోసం విషం కలిపిన కేక్ ను వారికి తినిపించి.. ఆపై అదే కేకును తాను కూడా తిని ఆత్మహత్య చేసుకుని ఉంటాడేమోనన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

ఎవరీ ప్రభాకర్ రెడ్డి:
శంకర్పల్లి మండలం కొత్తపల్లికి చెందిన పట్లోళ్ల ప్రభాకర్రెడ్డి ఎంబీఏ వరకు చదివాడు.సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలంలోని అశోక్నగర్ లో స్థిరపడి ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లికి చెందిన మాధవిని ఐదేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే అతను షేర్ మార్కెట్ బిజినెస్ లోకి ప్రవేశించాడు.
ఇండియా ఇన్ఫోలైఫ్ కంపెనీకి ఏజెంట్గా పనిచేస్తూ.. దగ్గరి బంధువులతో పాటు తెలిసినవాళ్లతో షేర్మార్కెట్లో డబ్బును ఇన్వెస్ట్ చేయించాడు. మంచి లాభాలు వస్తున్నట్లు వారికి నమ్మకం కలిగేలా చేశాడు. అయితే ఇటీవలి కాలంలో ప్రభాకర్రెడ్డి షేర్ మార్కెట్లో కోట్లలో నష్టపోయినట్టు తెలుస్తోంది.

పిన్ని దగ్గర అప్పు:
ప్రభాకర్ రెడ్డి పిన్ని లక్ష్మి, ఆమె భర్త రవీందర్రెడ్డి సిగ్నోడ్ కాలనీలో నివాసం ఉంటున్నారు. రవీందర్రెడ్డి రుద్రారంలోని ఐటీడబ్ల్యూ సిగ్నోడ్లో ఆపరేటర్గా పని చేస్తూనే బిల్డర్గా ఎదిగి ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకున్నాడు. వారం రోజుల వ్యవధిలో కోట్లలో నష్టపోయాడని, రూ.30 కోట్ల దాకా అప్పులు చేశాడని స్థానికంగా ప్రచారం జరుగుతోంది.
షేర్ మార్కెట్లో భారీగా నష్టపోయిన ప్రభాకర్ రెడ్డి పిన్ని లక్ష్మి నుంచి కూడా రూ.2కోట్ల దాకా అప్పు తీసుకున్నట్లు తెలుస్తోంది. శేరిలింగంపల్లి మండలం శంకర్నగర్లో ఓ ఇంటిని అమ్మగా వచ్చిన రూ.70 లక్షలతోపాటు ఇటీవల మరో ప్లాటు అమ్మగా వచ్చిన మరో రూ.30 లక్షలను ప్రభాకర్రెడ్డికి ఇచ్చినట్లు లక్ష్మి భర్త రవీందర్రెడ్డి పోలీసులకు తెలిపారు.

ఆరోజు ఏం జరిగింది?:
ఔటర్ రింగు రోడ్డుపై వీరి మృతదేహాలు కనిపించడం కన్నా ముందు రోజు.. ప్రభాకర్ రెడ్డి తన భార్య మాధవి, కుమారుడు వశిష్ట్ లతో కలిసి సోమవారం పిన్ని లక్ష్మి ఇంటికెళ్లాడు. అక్కడి నుంచి లక్ష్మి కూతురు సింధుజతో కలిసి అందరూ మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో రవీందర్రెడ్డికి చెందిన కారులో డిండి ప్రాజెక్టు చూసొద్దామని వెళ్లారు. ఇదే విషయాన్ని రవీందర్ రెడ్డికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. తిరిగి సాయంత్రం 6 గం. సమయంలో రవీందర్ రెడ్డికి ఫోన్ చేసిన లక్ష్మి.. ఇంటికి వస్తున్నట్లు తెలిపింది.

ఆ తర్వాత స్విచ్చాఫ్:
6గం.కు ఫోన్ చేసి ఇంటికొస్తున్నామన్న భార్య నుంచి మళ్లీ ఎలాంటి సమాచారం లేకపోవడంతో రవీందర్ రెడ్డి ఆందోళన చెందాడు. ప్రభాకర్ రెడ్డి సహా అతని భార్య మాధవి, లక్ష్మి ఫోన్లు కూడా స్విచ్చాఫ్ రావడంతో ఆందోళన మరింత ఎక్కువైంది. దీంతో పోలీసులకు సమాచారం అందించాడు. ఆ రాత్రంతా చూసినా.. వారు ఇంటికి రాకపోయేసరికి మంగళవారం ఉదయం కొందరు సహోద్యోగులతో కలిసి డిండికి బయలుదేరారు. అలా మహేశ్వరం మార్గం నుంచి వెళ్తుండగా పోలీసుల నుంచి వీరికి సమాచారం అందింది. ఔటర్ రింగు రోడ్డుపై మృతదేహాలు పడి ఉన్నట్టు వారు రవీందర్ రెడ్డికి తెలిపారు. అప్పటికే రవీందర్ రెడ్డి కుమారుడు బీటెక్ విద్యార్థి దినేశ్రెడ్డి అమీన్పూర్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు.

ప్రభాకర్ రెడ్డే హత్య చేసి ఉంటాడా?:
షేర్ మార్కెట్లో నష్టాలు వచ్చిన సంగతి బయటపెడితే తనపై నమ్మకంతో అందులో ఇన్వెస్ట్ చేయించిన వారి నుంచి తీవ్ర ఒత్తిడులు వస్తాయని ప్రభాకర్ రెడ్డి ఆందోళన చెందినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తన కుటుంబాన్ని, పిన్ని, ఆమె కూతురిని హత్య చేసి ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడా? అన్న ఆరా మొదలైంది.
డిండికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో తన భార్య, కొడుకుతోపాటు పిన్ని లక్ష్మి, ఆమె కూతురు సింధుజకు ప్రభాకర్ రెడ్డి విషం కలిపిన కేక్ తినిపించి.. నీళ్లు తాగించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ తర్వాత తాను కూడా వాటిని తిన్నట్లు భావిస్తున్నారు.
విషం కేకు తిన్న తర్వాత అపస్మారక స్థితికి చేరుకున్న పిన్ని, సోదరి, భార్యను సర్వీసు రోడ్డు పక్కన ఉన్న పొదల్లో పడేసి.. తనను, కుమారుడిని ప్రభాకర్రెడ్డి రక్షించుకునే ప్రయత్నమేమైనా చేశాడా? అన్న దిశగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు.
ఆ క్రమంలోనే బ్రిడ్జి కిందకు చేరుకుని ఉంటాడని అనుమానిస్తున్నారు. దీంతో కేసును నాలుగు హత్యలు, ఒక ఆత్మహత్య కోణంలోను పోలీసులు విచారిస్తున్నారు. ఘటన స్థలంలో ప్రభాకర్రెడ్డి, ఇతరుల ఫోన్లు లభించకపోవడం గమనార్హం.

భర్తకు తెలియకుండా ఇచ్చినందువల్లేనా?:
తన భర్తకు తెలియకుండా ప్రభాకర్రెడ్డికి లక్ష్మి డబ్బులు ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ ప్రభాకర్ రెడ్డి నిండా మునగడంతో భర్తతో ఈ విషయం ఎలా చెప్పాలో తెలియక లక్ష్మి తీవ్ర ఆందోళన చెందినట్లు తెలుస్తోంది. ఈ కారణమే ఆమెను కూడా ఆత్మహత్యక పురిగొల్పిందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోట్లలో షేర్ వ్యాపారం చేసే ప్రభాకర్ రెడ్డి సింగిల్ బెడ్రూం ఇంట్లో అద్దెకు ఉండడం.. ఇల్లు కూడా సాదాసీదాగా ఉండటం చర్చనీయాంశమైంది.

పోలీసులు ఏం చెప్పారు?:
ఐదుగురి అనుమానాస్పద మృతిపై అన్ని కోణాలలో విచారణ జరుపుతున్నామన్నారు పోలీసులు. ఇప్పటివరకు లభించిన సాక్ష్యాధారాలను పరిశీలిస్తే.. వారంతా విషం తీసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టుగా అనుమానిస్తున్నామన్నారు. పోస్టుమార్టం నివేదిక వస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయన్నానరు. త్వరలోనే ప్రభాకర్ రెడ్డి బంధువులు, అతని వద్ద పెట్టుబడులు పెట్టిన వారిని విచారిస్తే ఆత్మహత్యలకు కారణం తెలుస్తుందని అన్నారు.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications