రాంగ్రూట్లో వచ్చిన మృత్యువు: ఐదుగురు మృతి
నల్గొండ: వివాహ శుభకార్యానికి వెళ్లి సంతోషంగా ఇంటికి తిరిగివస్తున్న ఆ కుటుంబం మరో ఐదు నిమిషాల్లో గమ్యస్థానం చేరుకుంటోందనగా మృత్యురూపంలో ఎదురుగా వచ్చిన లారీ కారును ఢీ కొంది. దీంతో కారులు ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండల పరిధిలోని వాడపల్లిలో మంగళవారం సంభవించిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురితో పాటు కారు డ్రైవర్, అతని స్నేహితుడు ప్రాణాలు విడిచారు.
వాడపల్లి ఎస్ఐ జానయ్య తెలిపిన వివరాల ప్రకారం దామరచర్ల మండల పరిధిలోని వాడపల్లి గ్రామానికి చెందిన షేక్ అబ్దుల్ ఖలీల్ (30), భార్య రిజ్వాన (25), చిన్న కూతురు ఫర్హాన్ (4), పెద్దకూతురు తహసిల్, కారు డ్రైవర్ కారంపూడి విజయ్ (30), ఖలీల్ మిత్రుడు పూజల సైదయ్య (20)తో కలిసి ఇన్నోవా కారులో సోమవారం రాత్రి నల్లగొండ సమీపంలో చెర్లపల్లి గ్రామంలో ఖలీల్ మేనమామ కొడుకు వివాహానికి వెళ్లారు.
అక్కడ వివాహం ముగిసిన అనంతరం అర్ధరాత్రి ఒకటిన్నరకు ఇంటికి పయనమయ్యారు. అద్దంకి- నార్కట్పల్లి రహదారిపై వాడపల్లి గ్రామంలోకి వచ్చేందుకు కారు మలుపుతుండగా రాంగ్ రూట్లో ఎదురుగా వచ్చిన ముగ్గులోడ్ లారీ వారి కారును ఢీకొట్టింది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా, అందులోని ఐదుగురు ఖలీల్, రిజ్వానా, ఫర్హాన్, విజయ్, సైదయ్య అక్కడిక్కక్కడే మృతి చెందారు. ఖలీల్ పెద్ద కూతురు తహసీల్కు తీవ్రగాయాలయ్యాయి.
ఆమెను చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని సన్రైస్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఖలీల్తో పాటు అతని భార్య రిజ్వానా, చిన్నకూతురు ఫర్హాన్ మృతి చెందడం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. రోడ్డు ప్రమాదంలో తన కుమారుడు, కోడలు, చిన్న మనుమరాలు మృతి చెందడంతో పట్ల ఖలీల్ తల్లి రోదనలు మిన్నంటాయి. ‘అల్లా ఏ క్యాకియా' అంటూ ఆమె రోదనలు అక్కడున్నవారిని కంటతడి పెట్టించాయి.
కాగా, ఖలీల్కు స్నేహితుడైన పూజల సైదయ్య వివాహానికి వెళ్లి వద్దామని ఖలీల్ పిలవడంతో వారి వెంట వెళ్లాడు. స్నేహితునితో వివాహానికి వెళ్లి తిరిగి వస్తాడనుకున్న సైదయ్య మృతి చెందడంతో సైదయ్య కుటుంబంలో విషాదం నెలకొంది.