ఆఖరి మజిలీకి వరద కష్టాలు; శవంతో వాగు దాటుతున్న వీడియో!!
రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు వరదల కారణంగా పరిస్థితులు దారుణంగా మారాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పనులు చేసుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై చిరు వ్యాపారాలు వ్యాపారాలు చేసుకునే పరిస్థితి లేదు. ఇక హైదరాబాద్ నగరం చిగురుటాకులా వణుకుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాలలో కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. అనేక జిల్లాల్లో పనులు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వర్షాల ప్రభావంతో వాగులు, వంకలు రోడ్లపైకి వచ్చి పొంగి ప్రవహిస్తున్న క్రమంలో చాలా ప్రాంతాలలో రాకపోకలు నిలిచిపోయాయి. అనేక కాలనీలు నీట మునగటంతో అక్కడ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకుతరలిస్తూ సహాయం అందిస్తున్నారు.

అసలే వర్షాలతో పరిస్థితులు దారుణంగా ఉన్న సమయంలో ఓ వ్యక్తి మరణం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని సాహసం చేసేందుకు కారణమయ్యాయి. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే భారీ వర్షాల కారణంగా సిద్దిపేట - చేర్యాల మండలంలో ఉన్న వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఆ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
అయితే ఇదే సమయంలో చనిపోయిన ఓ వ్యక్తిని శవ దహనం కోసం స్మశానానికి తీసుకు వెళ్ళాలి అంటే వాగు దాటి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. దీంతో చేసేదేమీ లేక విధిలేని పరిస్థితుల్లో పాడెపై శవాన్ని మోసుకుంటూ ఆ కుటుంబ సభ్యులు వాగు దాటారు. వాగు దాటుతున్న అంతసేపు వారు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెళ్ళవలసి వచ్చింది. పీకల్లోతు నీళ్లలో వారు వాగు దాటి శవ దహన కార్యక్రమాన్ని నిర్వహించవలసి వచ్చింది.
ఆఖరి మజిలీకి వరద కష్టాలు; శవంతో వాగు దాటుతున్న వీడియో..!! pic.twitter.com/SGNEP831dR
— oneindiatelugu (@oneindiatelugu) July 26, 2023
భయం గుప్పిట్లో ఒకరి చేతులు ఒకరు పట్టుకొని గుంపుగా వారి వాగు దాటుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఆఖరి మజిలీ కి కూడా వరదల కష్టాలు తప్పడం లేదన్న అభిప్రాయం ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిలోనూ వ్యక్తమవుతుంది. ఇది రాష్ట్రంలోని వరద పరిస్థితులకు కూడా అద్దం పడుతుంది.












Click it and Unblock the Notifications