రేవంత్, బండి సంజయ్ సహా ఈ నేతల ఫోన్లు ట్యాప్, ఎమ్మెల్యేల కొనుగోలుపై రాధాకిషన్ రావు సంచలనం
తెలంగాణ రాష్ట్రంలో కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బీఆర్ఎస్కు ఇబ్బందిగా మారిన వ్యక్తుల ఫోన్లపై నిఘా పెట్టినట్లు ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ డీసీపీ రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో వెల్లడించారు. ప్రతిపక్ష పార్టీల నేతల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు అంగీకరించారు.
ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబసభ్యులపైనా నిఘా పెట్టినట్లు రాధాకిషన్ రావు తెలిపారు. అప్పటి బీఎస్పీ నేత ప్రవీణ్ కుమార్, తీగల కృష్ణారెడ్డి, తీన్మార్ మల్లన్న ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు చెప్పారు.ఈటల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్ అనుచరుల ఫోన్లపైనా నిఘా ఉంచామని తెలిపారు. జువ్వాడి నర్సింగరావు, వంశీకృష్ణ, కవ్వంపల్లి సత్యనారాయణ, కాంగ్రెస్ నేత జానా రెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి, సరిత తిరుపతయ్యపై నిఘా పెట్టినట్లు తెలిపారు.

అంతేగాక, మాజీ డీసీపీ రాధాకిషన్రావు వాంగ్మూలంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి విస్తుపోయే అంశాలు కూడా ఉండటం గమనార్హం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2022 అక్టోబర్లో కాంగ్రెస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరినపుడు.. మునుగోడు ఉప ఎన్నికల్లో ఆయనను ఓడించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావించారని రాధాకిషన్రావు తన వాంగ్మూలంలో తెలిపారు.
దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచినందున మునుగోడులో ఎలాగైనా బీజేపీని ఓడించాలనే లక్ష్యంతో కేసీఆర్ ఉన్నట్టు రాధాకిషన్రావు తెలిపారు. ఈ సమయంలోనే పైలెట్ రోహిత్రెడ్డి సహా పలువురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేర్చుకోవాలని అగ్రనేతలను సంప్రదించినట్టు తెలిసింది. బీజేపీ చెక్ పెట్టేందుకు వారిపై సర్వేలైన్స్ పెట్టాలని కేసీఆర్, ఎస్ఐబీకి చెప్పినట్టు రాధాకిషన్రావు తన వాంగ్మూలంలో వెల్లడించారు.
ఈ క్రంమలో, అప్పటి ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై తనతో చర్చించారని, బీజేపీ అగ్రనేతల ఫోన్లను ప్రణీత్రావు బృందం ట్యాప్ చేసినట్టు రాధాకిషన్రావు చెప్పారు. అలా ట్యాప్ చేసిన ఒక ఆడియో టేప్ను కేసీఆర్కు పంపినట్టు వెల్లడించారు. ఆ తర్వాతే కేసీఆర్ అందరినీ ట్రాప్ చేయాలని ఆదేశించినట్టు పేర్కొన్నారు. ఈ క్రమంలో స్పై కెమెరాల కోసం టాస్క్ఫోర్స్ టీంను ఢిల్లీ పంపామని, ట్రాప్ చేయడానికి ఒకరోజు ముందే కెమెరాలను ఫామ్హౌస్లో అమర్చామని తెలిపారు.
ఆపరేషన్ మొత్తం బాధ్యతను సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులకు అప్పగించామని రాధాకిషన్ రావు తెలిపారు. ఎమ్మెల్యే కొనుగోలు కేసు కోసం ప్రత్యేక దర్యాప్తు వేసి బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్ను అరెస్టు చేయాలని కేసీఆర్ ఆదేశించినట్టు తెలిపారు. బీఎల్ సంతోష్ను అరెస్టు చేస్తే ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కాకుండా బీజేపీ అగ్రనేతలతో చర్చలు జరుపుదామని అనుకున్నట్టు రాధాకిషన్రావు తన వాంగ్మూలంలో పేర్కొనడం గమనార్హం.
అయితే కొంతమంది అధికారుల అసమర్థతవల్లే సంతోష్ను అరెస్ట్ చేయలేకపోయామని రాధాకిషన్ రావు తెలిపారు. పలువురు అధికారులను కేరళకు పంపించినా ప్రణాళికను విజయవంతం చేయలేదన్నారు. సంతోష్ను అరెస్టు చేయకపోవడంపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినట్లు రాధాకిషన్రావు వెల్లడించారు. పెద్దాయన(కేసీఆర్)తో ఉన్న అనుబంధం వల్ల ఇంతకంటే ఎక్కువ విషయాలను చెప్పలేనని రాధాకిషన్రావు తన వాంగ్మూలంలో పేర్కొన్నట్టు సమాచారం.












Click it and Unblock the Notifications