కొడుకును దుబాయ్ సాగనంపి వస్తుండగా ప్రమాదం: ఏపీ ఫ్యామిలీ మృతి
మహబూబ్నగర్: రంజాన్ పర్వదినం సందర్భంగా దుబాయ్ నుంచి కొడుకు ఇంటికి రావడంతో ఆ కుటుంబంలో ఆనందాలు వెల్లివిరిసాయి. రంజాన్ పండగ ముగిసిన క్రమంలో అతడ్ని శంషాబాద్ విమానాశ్రయంలో దిగబెట్టేందుకు కుటుంబమంతా తరలివచ్చింది. అతడ్ని సాగనంపి తిరుగురుపయనమైన ఆ కుటుంబం ఘోర ప్రమాదానికి గురైంది. ఎంతో సంతోషంతో వారు వెళుతున్న కారుకు ఓ లారీ అడ్డువచ్చింది. వేగంగా వెళుతున్న కారును అదుపుకాకపోవడంతో లారీని ఢీకొంది. దీంతో కారులోని వారంతా ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన మానవపాడు మండలం జల్లాపురంలో చోటు చేసుకుంది.
అలంపూర్ సీఐ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. కర్నూలు పట్టణం లాల్మాసీదు కడక్పూర కాలనీకి చెందిన శంఖు బీడీ కంపెనీ యజమాని నసీర్ అహ్మద్ కొడుకు.. సోయబ్ అమ్మద్ ఖాతూన్ దుబాయిలో ఉద్యోగం చేస్తున్నాడు. రంజాన్ సందర్భంగా ఇంటికి రాగా అతడిని మళ్లీ దుబాయికి సాగనంపేందుకు ఆదివారం రాత్రి నసీర్ అమ్మద్(62), అతడి భార్య రిజ్వానా ఖాతూన్(55), కోడలు ఫర్జానా ఖాతూన్(35), మనుమరాళ్లు హనియా ఖాతూన్(4), అలియా ఖాతూన్(5) కుటుంబ సభ్యులు కలిసి కారులో కర్నూలు నుంచి హైదరాబాద్కు వెళ్లారు.
సోమవారం తెల్లవారుజామున విమానాశ్రయంలో సోయబ్తో అందరూ సంతోషంగా గడిపారు. అతడిని సాగనంపి తిరిగి హైదరాబాద్ నుంచి కర్నూలుకు బయలుదేరారు. నసీర్ అహ్మద్ కారు నడుపుతుండగా అందరూ నిద్రలో ఉన్నారు. సరిగ్గా మానవపాడు మండలం జల్లాపురం స్టేజీ సమీపంలోకి రాగానే ముందు వెళ్తున్న సిమెంట్ లారీ ఒక్కసారిగా ఎడమ వైపు మళ్లింది.
నసీర్ అమ్మద్ కారును అదుపుచేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. లారీని వెనుక నుంచి కారు బలంగా ఢీకొట్టింది. కారు అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న చిన్నపాటి కాలువలోకి దూసుకెళ్లింది. కారు ముందు భాగం ధ్వంసం కాగా, అందులోని నసీర్ అమ్మద్, రిజ్వానా ఖాతూన్, ఫర్జానా ఖాతూన్, హనియా ఖాతూన్లకు అక్కడిక్కడే చనిపోయారు.
అలియా ఖాతూన్కు తీవ్రగాయాలతో బయటపడింది. ప్రమాదం సమాచారం అందుకున్న అలంపూర్ సీఐ వెంకటేశ్వర్లు, మానవపాడు ఎస్ఐ భగవంతరెడ్డి హుటహుటినా సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకున్నారు. కారులో ఇరుక్కున్న మృతదేహాలను అతికష్టం మీద బయటకు తీశారు. కారులో అధారాలు సేకరించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను అలంపూర్ ఆస్పత్రికి తరలించారు.
ఈ మేరకు లారీ డ్రైవర్పై కేసు నమోదు చేశారు. ఈ రోడ్డు ప్రమాదంలో కుటుంబమంతా మృతిచెందగా సోయబ్ అమ్మద్ ఖాతూన్ పెద్ద కుతురు అలియా ఖాతూన్ మాత్రం తీవ్రగాయాలతో బయటపడింది. ఈ చిన్నారిని అంబులెన్స్లో కర్నూలు ఆస్పత్రికి తరలించి ప్రాణాపాయ స్థితి నుంచి బయటికి తెచ్చారు.