ఎఫ్ఆర్వో హత్యపై సీఎం కేసీఆర్ సీరియస్: రూ. 50 లక్షల పరిహారం, కీలక ఆదేశాలు
హైదరాబాద్: పోడుభూముల సాగుదారుల(గుత్తికోయలు) దాడిలో మృతి చెందిన ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అటవీ ఆక్రమణలు సహించేది లేదన్నారు. ఆక్రమణదారులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శ్రీనివాసరావుపై దాడికి పాల్పడినవారిని కఠిన శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేశారు.
శ్రీనివాసరావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన సీఎం కేసీఆర్.. రూ. 50 లక్షల పరిహారం ప్రకటించారు. డ్యూటీలో ఉన్నప్పుడు శ్రీనివాసరావుకు అందే జీతభత్యాలన్నీ పదవీ విరమణ వయస్సు వచ్చేదాకా ఆయన కుటుంబానికి అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
కారుణ్య నియామకం కింద కుటుంబసభ్యుల్లో అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. శ్రీనివాసరావు పార్థీవ దేహానికి ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని సీఎస్ను ఆదేశించారు. ఉద్యోగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎలాంటి భయం లేకుండా విధులు నిర్వహించాలని సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు.
కత్తితో పోడుభూముల సాగుదారుల దాడి, అటవీశాఖ అధికారి మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోడు భూముల వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. చివరకు పోడు సాగుదారుల దాడిలో తీవ్రంగా గాయపడిన ఓ అటవీశాఖ అధికారి ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చంద్రగొండ మండలం బెండాలపాడు అటవీ ప్రాంతం ఎర్రబోడు సమీపంలో అటవీశాఖ అధికారులు నాటిన మొక్కలను తొలగించేందుకు వెళ్లిన సాగుదారులను అధికారులు అడ్డుకున్నారు. అంతేగాక, పోడుభూముల సాగుదారులు మూకుమ్మడిగా వారిపై దాడి చేశారు.
దీంతో బెండాలపాడు అటవీశాఖ సెక్షన్ అధికారి రామారావు అక్కడ్నుంచి పారిపోయారు. అక్కడేవున్న అటవీ శాఖ రేంజ్ అధికారి శ్రీనివాసరావుపై పోడుసాగుదారులు కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో శ్రీనివాసరావు తీవ్రంగా గాయపడ్డారు. మెడభాగంలో కత్తితో దాడి చేయడంతో తీవ్రరక్తస్రావమైంది.
వెంటనే శ్రీనివాసరావును చంద్రుగొండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడ్నుంచి ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, మార్గమధ్యలోనే శ్రీనివాసరావు మృతి చెందారు. దాడికి పాల్పడినవారిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.