కొలిక్కి వస్తోన్న ఓటుకు నోటు, ఆ ఫోన్లో రూ.5కోట్ల వివరాలు! 'బాస్'పై తేలనుంది
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఎసిబి దర్యాఫ్తు కొనసాగిస్తోంది. నిందితుడు సెబాస్టియన్ ఫోన్లో నమోదైన సంభాషణల ఫోరెన్సిక్ విశ్లేషణల తుది నివేదిక సిద్ధమవుతోందని తెలుస్తోంది. వారం రోజుల్లో ఆ నివేదికను కోర్టుకు సమర్పించే అవకాశం ఉంది.
సెబాస్టియన్ నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లో మొత్తం 500 ఫోన్ కాల్స్కు సంబంధించిన సంభాషణలు నమోదైనట్లు ఎసిబి గుర్తించినట్లుగా తెలుస్తోంది. వీటన్నింటినీ విశ్లేషించిన తర్వాత వాటిలో వంద కాల్స్ మాత్రమే ఈ కేసుతో సంబంధం ఉందని, మిగతావన్నీ వ్యక్తిగతమని తేల్చారని తెలుస్తోంది.
కేసుతో సంబంధం ఉన్న కాల్స్లో సమాచారాన్ని తమ దర్యాప్తు కోసం వినియోగించుకోవాలని ఎసిబి అధికారులు ఆలోచిస్తున్నారు. అయితే ఫోన్ విశ్లేషణ కోర్టు పర్యవేక్షణలో ఫోరెన్సిక్ అధికారులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ పని జరుగుతోంది.
తమ దర్యాప్తునకు అవసరమని భావించిన కాల్స్ను ఎసిబి విశ్లేషిస్తోంది. వాటిలో ఉన్న సంభాషణలను యథావిధిగా ఆంగ్లంలో ముద్రించి కోర్టుకు సమర్పిస్తారు. సంభాషణ ఎవరెవరి మధ్య జరిగిందో గుర్తించడంతో పాటు అందులో స్వరం వారిదా? కాదా? అన్నదాన్ని కూడా నిర్ధారించనున్నారు.
ప్రతి సంభాషణను పూర్తిగా విని, దాన్ని రాతపూర్వకంగా సిద్ధం చేయడానికి ఎక్కువ సమయం పడుతోందని తెలుస్తోంది. నివేదిక ఆలస్యానికి ఇదే కారణమని తెలుస్తోంది. ఆ పని త్వరలో పూర్తి కానుందని సమాచారం. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా దర్యాఫ్తు చేపట్టవలసి ఉంది.
స్టీఫెన్ సన్కు ఇచ్చేందుకు సిద్ధం చేసిన రూ.50 లక్షలు ఎక్కడ నుంచి తెచ్చారు? మిగతా రూ.4.5కోట్లు ఎక్కడ నుంచి తేవాలనుకున్నారన్న దానిపై ఎసిబి అధికారులు ఆధారాలు సేకరించినట్లుగా తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి. ఈ అంశంపై సెబాస్టియన్ ఫోన్లో నమోదైన సంభాషణల్లోనూ కొంత సమాచారం ఉందని తెలుస్తోంది. దాని ఆధారంగా ముందుకెళ్లనున్నారని సమాచారం. మరోవైపు, ఎఫ్ఎస్ఎల్ నివేదిక చంద్రబాబు అంశాన్ని తేల్చనుంది.