పంథా మారిందా?: కెసిఆర్ ప్రభుత్వంపై గద్దర్ ప్రశంసలు
సంగారెడ్డి: వరంగల్ లోకసభ ఎన్నికల్లో తమ ఉమ్మడి అభ్యర్థిగా ప్రజా గాయకుడు గద్దర్ను నిలబెట్టాలని తెలంగాణ వామపక్షాలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. వరంగల్ లోకసభ సీటుకు తాను పోటీ చేయబోనని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రభుత్వ పథకాలను ఆయన మెచ్చుకున్నారు.
రాష్ర్టాభివృద్ధికి ప్రభుత్వం చక్కటి ప్రణాళికలు సిద్ధం చేసిందని ఆయన కొనియాడారు. ఆదివారం మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మంగళనపర్తిలో ఆయన మీడియాతో మాట్లాడారు. అభివృద్ధికి ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం, చెరువు, కుంటల పునరుద్ధరణ వంటి ఎన్నో చక్కటి ప్రణాళికలు రూపొందించిందని చెప్పారు.

రైతులు ఆత్మహత్య చేసుకోవద్దని, ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాల ఆదుకోవడానికి ప్రభుత్వ ప్రకటించిన రూ.6 లక్షల ఎక్స్గ్రేషియాను స్వాగతిస్తున్నానని అన్నారు. గతంలో మృతిచెందిన రైతులకు కూడా ఇది వర్తింపచేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
వరంగల్ ఎన్కౌంటర్పై ప్రభుత్వం కూడా చర్చిస్తుందని చెబుతూ దీనిపై పూర్తిస్థాయిలో విచారించి, భవిషత్లో ఇటువంటివి జరుగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. వరంగల్ ఎంపీ ఉపఎన్నికల్లో ప్రస్తుతానికి తాను పోటీ చేయనని, భవిషత్ను ప్రజలే నిర్ణయిస్తారన్నారు.
కెసిఆర్ ప్రభుత్వ పథకాలపై చేసిన వ్యాఖ్యలను, ఇద్దరు మావోయిస్టుల ఎన్కౌంటర్పై మాట్లాడిన తీరును చూస్తుంటే గద్దర్ పంథా మారినట్లు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.












Click it and Unblock the Notifications