గ్రేటర్ ఎన్నిక: టిఆర్ఎస్ దూకుడు, 87-63... బిజెపి-టిడిపి మధ్య అర్ధరాత్రి కొలిక్కి
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నామినేషన్ పర్వం ఆదివారంతో ముగియనుంది. తెరాస అభ్యర్థులు దాదాపు ఖరారయ్యారు. తొలి విడతలో 80 మందిని శనివారం నాటికి తెరాస ఖరారు చేసింది. పిజెఆర్ కూతురు విజయా రెడ్డి ఖైరతాబాద్ డివిజన్ నుంచి బరిలోకి దిగనున్నారు.
కాంగ్రెస్ పార్టీ బలం లేని చోట పోటీ చేసే అవకాశాలు కనిపించడం లేదు. తద్వారా అన్ని స్థానాల్లో ఆ పార్టీ పోటీ చేయకపోవచ్చు. మిగిలిన జాబితాపై కసరత్తు చేస్తోంది. బిజెపి - టిడిపి మధ్య పొత్తు శనివారం అర్ధరాత్రికి కుదిరింది. బిజెపి 63, టిడిపి 87 స్థానాలలో పోటీ చేయనుంది.
కాంగ్రెస్ శుక్రవారం 45 మంది అభ్యర్థులను ప్రకటించింది. శనివారం రోజంతా ప్రధాన నేతలు చర్చించినా మిగిలిన 105 స్థానాలకు అభ్యర్థులను వెల్లడించలేక పోయారు. శనివారం నగరంలోని ఒక ప్రయివేటు హోటల్లో ముఖ్య నాయకులంతా సమావేశమై ఈ అంశంపై కసరత్తు చేశారు.

ఆదివారం తుది జాబితా ప్రకటించి అప్పటికప్పుడు నామినేషన్లు వేయించనున్నారు. కొన్ని డివిజన్లకు అభ్యర్థులను ఖరారు చేసినా ప్రకటిస్తే అసమ్మతి చెలరేగి బలమైన నేతలు ఇతర పార్టీలకు మారే అవకాశముండటంతో ఆదివారమే ప్రకటించి దగ్గరుండి నామినేషన్లను వేయించాలని అనుకుంటున్నారు.
మజ్లిస్ పార్టీ శనివారం అధికారికంగా అభ్యర్థులను ప్రకటించలేదు. జాబితాలో చివరి నిమిషంలోనూ మార్పులు చేసినట్లు చెబుతున్నారు. అన్ని స్థానాలు కాకుండా బలమైన వాటిలోనే పోటీకి నిలపాలని పార్టీ యోచిస్తున్నట్లు చెబుతున్నారు.
తెరాస శుక్రవారం నాటికి 80 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన 70 స్థానాలకూ ఎంపిక పూర్తయింది కూడా. ఈ జాబితాను ఆదివారం ఉదయం ప్రకటించాలని అనుకుంటున్నారు. అభ్యర్థుల ఖరారులో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కీలక భూమిక పోషించారు.
ఎంపిక సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సూచనలను చేసినట్లుగా తెలుస్తోంది. ఏళ్లుగా పార్టీకి సేవలందిస్తున్న వారికి టిక్కెట్లను ఇవ్వాలని చెప్పినట్లు తెలుస్తోంది. చర్లపల్లి డివిజన్ అభ్యర్థిగా బొంతు రామ్మోహన్ పేరు ఖరారైంది. ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవడం వల్లే ఆయన పేరు ఖరారైనట్లు చెబుతున్నారు.
టిడిపి, బిజెపి మధ్య పొత్తు కొలిక్కి వచ్చినట్లు ఆ పార్టీల రాష్ట్ర అధ్యక్షులు ఎల్ రమణ, కిషన్ రెడ్డిలు శనివారం రాత్రి ప్రకటించారు. రాత్రి పది గంటల వరకు ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేయాలన్న దానిపైనే ఒక నిర్ణయానికి రాలేక పోయారు.
2009లో 150 డివిజన్లలో గత ఎన్నికల్లో 45 డివిజన్లలో టిడిపి, 5 చోట్ల బిజెపి గెలుపొందాయి. ఈ సిట్టింగ్ స్థానాల్లో తిరిగి అవే పార్టీలు పోటీ చేయాలన్న నిర్ణయానికి వచ్చాయి. మిగిలిన వంద స్థానాల విషయంలో ఇద్దరి మధ్య ఒక అంగీకారం కుదరలేదు. ఎన్ని స్థానాలు, ఏఏ డివిజన్లలో ఏ పార్టీ పోటీ చేయాలన్న విషయంలోనూ కొంత పేచీ నెలకొనగా.. శనివారం రాత్రి పదకొండు గంటల సమయంలో టిడిపి 87, బిజెపి 63 ఒప్పందం కుదిరినట్లు రెండు పార్టీలు ప్రకటించాయి.












Click it and Unblock the Notifications