నిశ్చితార్థం జరిగాక పెళ్లి వద్దన్నాడని యువతి ఆత్మహత్య
హైదరాబాద్: పెళ్లి చేసుకోవడానికి అంగీకరించి, నిశ్చితార్థం కూడా జరిగిన తర్వాత ఓ యువకుడు పెళ్లికి నిరాకరించడంతో ఓ నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. నువ్వంటే నాకు ఇష్టం లేదని అతను చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది.
సికింద్రాబాదులోని బాలానగర్ పీఎస్ ఎస్సై ఎస్ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం - నిజామబాద్ జిల్లా బోధన్కు చెందిన ఆకుల అనూష (24) తన అన్నతో పాటు పినతల్లి కుమారుడితో కలిసి బాలానగర్ వినాయక్నగర్లో నివాసం ఉంటోంది. అనూష ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది.

నిజామబాద్ జిల్లాకు చెందిన సందీప్తో పెద్దల సమక్షంలో జూలై 7న నిశ్చితార్థం జరిగింది. మధ్యాహ్నం సందీప్ ఇంటికి వచ్చాడు. నీతో పెళ్లికి ఇష్టం లేదని చెప్పి వెళ్లిపోయాడు. మనోవేదనకు గురైన అనూష ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఫ్యాన్కు ఉరివేసుకుంది.
తమ్ముడు డ్యూటీ నుంచి ఇంటికి వచ్చి తలుపు తట్టాడు. తీయకపోవడంతో కిటికీలోంచి చూడగా, అనూష ఫ్యాన్కు వేలాడుతూ కన్పించింది. స్థానికుల సహాయంతో అనూషను వైద్యశాలకు తీసుకెళ్లారు అప్పటికే చనిపోయినట్లు వైద్యులు పరిశీలించి ధ్రువీకరించారు.
అనూష తల్లి సందీప్ పెళ్లికి నిరాకరించడం కారణంగానే తన కూతురు ప్రాణాలు తీసుకుందని ఫిర్యాదు చేసింది. అనూష మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.












Click it and Unblock the Notifications