రాంగ్ కాల్తో చిగురించిన ప్రేమ: లక్షలు కొట్టేసి ఉడాయించిన ప్రియుడు
హైదరాబాద్: యువతీయువకుల మధ్య ఫోన్ కాల్తో పరిచయం స్నేహంగా మారి అది ప్రేమకు దారితీసింది. ఆరు నెలల పాటు చనువుగా ఉన్నారు. పెళ్లి చేసుకుంటానని అతను నమ్మబలికాడు. ఆ తర్వాత ప్రేయసి నుంచి రూ.4.25 లక్షలు తీసుకుని ఉడాయించాడు. ఈ సంఘటన బుధవారం మెదక్ జిల్లా జోగిపేటలో జరిగింది.
ఆరు నెలల క్రితం మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం చిలిప్చెడ్ గ్రామానికి చెందిన ఎఎన్ఎం శ్రీలత ఫోన్కు రాంగ్ కాల్ వచ్చింది. దీంతో ఆ రాంగ్ కాల్ అంటూ పెట్టేసింది. అతను పదే పదే ఫోన్ చేయడంతో ఇద్దరి మధ్య పరిచయం స్నేహంగా మారింది. తనను తాను యువకుడు కిశోర్ బాబుగా పరిచయం చేసుకున్నాడు.
తనది విజయవాడ అని, హైదరాబాదులోని బంజారాహిల్స్లో సొంత ఇల్లు ఉందని చెప్పాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఇద్దరు గత ఆరు నెలలుగా సన్నిహితంగా మెలుగుతూ వస్తున్నారు. హైదరాబాద్లో తాను ప్లాట్ కొంటున్నానని, రూ.35 వేలు తక్కువగా ఉన్నాయని, ఆ సొమ్మును సర్దుబాటు చేయాలని అడిగాడు.

జోగిపేట ఎస్బిఐలో డబ్బు డ్రా చేసేందుకు మంగళవారం ఉదయం ఇద్దరూ కలిసి వెళ్లారు. తన ఖాతా నుంచి శ్రీల రూ.35 వేలు డ్రా చేసి ఇచ్చింది. అదే సమయంలో శ్రీలత ఖాతాలో మరో రూ.3.90 లక్షల వరకు నగదు ఉన్నట్లు గమనించిన అతను మరో కుట్ర చేశాడు.
ఇంత డబ్బు ఉద్యోగి ఖాతాలో ఉండకూడదని, ఏడాది చివర ఆదాయం పన్ను సమస్యలు వస్తాయని చెప్పాడు. ఆమెతో మిగతా రూ.3.90 లక్షలు డ్రా చేయించాడు. మధ్యాహ్నం వరకు బ్యాంకులోనే ఉండి డబ్బులు తీసుకుని పక్కనే ఉన్న వెంకటేశ్వర సినిమా థియేటర్లోకి సినిమా చూసేందుకు వెళ్లారు.
సినిమా మధ్యలోనే బ్యాగులో ఉన్న ఆమెకు తెలియకుండా కాజేసి, తనకు ఫోన్ వస్తుందని మాట్లాడి వస్తానంటూ బయటకు వెళ్లిపోయాడు. 15 నిమిషాల వరకు కూడా రాకపోవడంతో ఆమె ఫోన్ చేసింది. సెల్ స్విచాఫ్ అయి ఉంది. దాంతో తన బ్యాగును చూసుకుంది. అందులో డబ్బు లేకపోవడంతో కంగు తిన్నది.
బయటకు వచ్చిన కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. దీనిపై బుధవారం జోగిపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు బ్యాంకులోని వీడియో ఫుటేజీలను పరిశీలించారు. అతని సెల్ నెంబర్ నల్లగొండ జిల్లా మిర్యాలగుడా శ్రీనివాస రావు పేరు మీద ఉన్నట్లు ఎస్ఐ విజయరావు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications