రైతులకు శుభవార్త.. మెగా రైతు మేళా, వాటిపై రైతులకు భారీ సబ్సిడీ!
తెలంగాణ రాష్ట్రంలో రైతు సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని రేవంత్ రెడ్డి సర్కార్ చెబుతోంది. రైతులను రుణ విముక్తులను చేయడంతో పాటు వారిని ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.
రైతులకు మంత్రి పొంగులేటి తీపి కబురు
అయితే ప్రతిపక్ష పార్టీలు రైతు డిక్లరేషన్ ను టార్గెట్ చేసి, కాంగ్రెస్ ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శిస్తున్న వేళ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రైతులకు తమ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని తెలియజేసి, మరో తీపి కబురు కూడా చెప్పారు.

సబ్సిడీపైన రైతులకు యంత్ర పరికరాలు
రైతు డిక్లరేషన్ లో ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అక్షరాలా అమలు చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక రైతు డిక్లరేషన్ ను ప్రకటించిన వరంగల్ సభా స్థలిలో ఈనెల 5, 6, 7 తేదీలలో మెగా రైతు మేళా నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. వేలాది మంది రైతులకు, సబ్సిడీపైన ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలు పంపిణీ చేస్తున్నట్టు ఈ సందర్భంగా తీపికబురు చెప్పారు.
రైతు డిక్లరేషన్ ప్రకారం రుణమాఫీ చేశాం
గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో రైతుల కోసం ఏమి చేయలేదని, రైతులను విస్మరించిందని పేర్కొన్నారు. కనీసం రైతులకు సబ్సిడీ యంత్ర పరికరాలు కూడా అందించలేదని విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ ప్రకటించిన రోజున ఇచ్చిన మాట ప్రకారం 25 లక్షలు మంది రైతులకు ఒకేసారి 21 వేల కోట్ల రుణమాఫీ చేసి రికార్డు సృష్టించామని మంత్రి గుర్తు చేశారు.
వరికి మద్దతు ధరతో పాటు, 500రూపాయల బోనస్ ఇచ్చాం
గత ప్రభుత్వం వరి సాగును నిరుత్సాహపరిస్తే, తమ ప్రభుత్వం మాత్రం వరికి మద్దతు ధర ఇవ్వడంతోపాటు, క్వింటాకు 500 రూపాయలు బోనస్ ఇస్తుందని తెలిపారు. రైతు భరోసా కింద ఎకరానికి 12000 సకాలంలో అందిస్తున్నామని, ధాన్యం కొనుగోలు చేసిన వారం రోజుల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని వివరించారు.
వారిది కపట ప్రేమ, బేడీలు వేసిన చరిత్ర
ప్రస్తుతం బీఆర్ఎస్ రైతుల మీద ప్రేమ ఉన్నట్టు కపట ప్రేమను ఒలకబోస్తోంది అని మండిపడ్డారు. రైతులకు బేడీలు వేసిన చరిత్ర వారిదని గుర్తు చేశారు. రైతు సంక్షేమం కోసం పనిచేస్తున్న ప్రభుత్వం తమ ప్రభుత్వమని, అందుకే ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నేటి నుంచి తొమ్మిదవ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా రైతు వారోత్సవాలు ఘనంగా జరుపుతున్నామని తెలిపారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం రైతులను మభ్యపెట్టి మోసం చేస్తే, రైతులు బీఆర్ఎస్ నాయకులను నమ్మే పరిస్థితి లేదన్నారు.












Click it and Unblock the Notifications