గవర్నర్ రబ్బర్ స్టాంప్ కాదు, తప్పుడు ప్రచారం, వారిని రెచ్చగొడుతున్నారు: తమిళిసై
హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. రాజ్భవన్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గవర్నర్ పలు కీలక అంశాలపై మాట్లాడారు. పెండింగ్లో ఉన్న బిల్లులుపై సందేహాలు నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.
బిల్లులు ఆపలేదు, ఖాళీల భర్తీ ఏది?: గవర్నర్ తమిళిసై
రాష్ట్ర ప్రభుత్వం నుంచి తన వద్దకు పలు బిల్లులు వచ్చాయి. బిల్లుల విషయమై పరిశీలిస్తున్నాం. సందేహాలు నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని బిల్లులను సమగ్రంగా పరిశీలించేందుకే సమయం తీసుకున్నా. ఆ బాధ్యత నాపై ఉంది. ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పాను అని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు.
ఖాళీల విషయమై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇచ్చనట్లు గవర్నర్ తెలిపారు. పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని పదే పదే డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. వర్సిటీల ఉమ్మడి నియామక బోర్డుపై ప్రక్రియ కొనసాగుతోందన్నారు. తాను ఎలాంటి బిల్లులు ఆపలేదని, బిల్లులను తొక్కిపెట్టాననడం సరికాదన్నారు. అయితే, కొత్త విధానంపై తనకు సందేహాలున్నాయని, ఈ విధానం అవసరమా? కాదా? అని పరిశీలిస్తున్నట్లు తమిళిసై తెలిపారు.
బిల్లులు అలా ఆమోదించను, వారిని రెచ్చగొడుతుందెవరు: గవర్నర్
బోధనా పోస్టులను భర్తీ చేయాలని మొదటి నుంచి చెబుతున్నట్లు గవర్నర్ తెలిపారు. కొత్త నియామక బోర్డు అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. వీసీ పోస్టులు కూడా చాలా రోజులుగా ఖాళీగా ఉన్నాయి. తాను పదే పదే డిమాండ్ చేశాక వీసీలను నియమించారు. 8 ఏళ్లుగా వీసీలను నియమించకపోతే జేఏసీ ఎందుకు ఆందోళన చేయలేదని గవర్నర్ తమిళిసై ప్రశ్నించారు. రాజ్ భవన్ను ముట్టడిస్తామంటూ జేసీఏ చెబుతోందని.. వారిని ఈ విధంగా ఎవరు రెచ్చగొడుతున్నారని నిలదీశారు. ఒక నెల రోజులు బిల్లు ఆగితేనే ఎందుకు ఈ ఆందోళన అని ప్రశ్నించారు. నియామకాల బిల్లుకే మొదటి ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. ఒకదాని వెంట ఒకటి పరిశీలిస్తున్నట్లు తెలిపారు. బిల్లులు పంపించగానే ఆమోదించడం మాత్రమే తన విధి కాదని, వాటిని పరిశీలించాల్సి ఉంటుందన్నారు. తానే రిక్రూట్మెంట్ ఆపినట్లు ప్రచారం సరికాదన్నారు.
ఇప్పుడే ప్రొటోకాల్ గుర్తొచ్చిందా?: తమిళిసై చురకలు
మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వంపైనా గవర్నర్ తమిళిసై సంచలన విమర్శలు గుప్పించారు. కొంత మంది ప్రొటోకాల్ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారని.. తన పర్యటనలకు సంబంధించి పూర్తి వివరాలు ముందుగానే సంబంధిత అధికారులకు పంపిస్తానని చెప్పారు. గతంలో తన పర్యటనల్లో ప్రొటోకాల్ పాటించని కలెక్టర్లు, ఎస్పీలపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. మీరు ప్రొటోకాల్ పాటించేవారైతే గవర్నర్కు స్వాగతం పలికేందుకు రాని అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. మీరు మీకు నచ్చినట్లు చేస్తూ.. అందరిపై విమర్శలు చేస్తారా? అని సర్కారుపై గవర్నర్ మండిపడ్డారు. కేవలం రాజ్ భవన్ గౌరవాన్ని దిగజార్చేందుకే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కాగా, ప్రధాని పర్యటన నేపథ్యంలో సీఎం కేసీఆర్కు సరైన విధంగా ఆహ్వానం అందలేదని, ప్రొటోకాల్ పాటించలేదని టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేస్తున్న క్రమంలో గవర్నర్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.