గవర్నర్ తమిళిసై ప్రజల వద్దకు పాలన.. జనం కోసం ఏం చేస్తున్నారో తెలుసా?
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై దూకుడు పెంచుతున్నారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి తెలంగాణ రాష్ట్ర సామాజిక,రాజకీయ పరిస్థితులపై ఆమె అవగాహన పెంచుకుంటున్నారు. వివిధ శాఖల పనితీరుపై గవర్నర్ ఇప్పటికే అధికారులను నివేదికలు అడిగినట్లుగా కూడా తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలతో మమేకమవుతూ ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని గవర్నర్ ప్రయత్నం చేస్తున్నారు.అందులో భాగంగానే తాజాగా ఆమె తీసుకున్న నిర్ణయం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు చర్చనీయాంశమైంది.

రాష్ట్ర సమస్యలపై దృష్టి పెట్టిన తెలంగాణా రాష్ట్ర గవర్నర్ తమిళిసై
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్,తమిళనాడు నుండి తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పటికీ తెలంగాణ రాష్ట్రంపై ఆమె తన అభిమానాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. రాజ్ భవన్ లో బతుకమ్మ సంబరాలు నిర్వహించి ఆ సంబరాలలో తెలంగాణ ఆడపడుచుల తో కలిసి పాల్గొని తెలంగాణ రాష్ట్ర మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.యూనివర్సిటీల పరిపాలన పడకేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఛాన్స్ లర్ హోదాలో ఆమె యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ లతో, రిజిస్ట్రార్ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. యూనివర్సిటీల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు ఇచ్చారు. విద్యా ప్రమాణాలు పెంచడానికి ఏం చేయాలో, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో అధికారులతో చర్చించారు.

ఆర్టీసీ సమ్మె విషయంలోనూ మంత్రిని, అధికారులను ప్రశ్నించిన గవర్నర్
ఇక అంతే కాదు తాజాగా ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్న ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మిక జెఎసి సమస్యల పరిష్కారం కోసం గవర్నర్ చొరవ చూపాలని కోరినప్పుడు కూడా ఆమె సానుకూలంగా స్పందించారు. ఆ తర్వాత రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను,అధికారులను ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమించటానికి ఏం చర్యలు తీసుకుంటుందో తెలియజేయాలని కోరారు. ఇక క్యాబ్ డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లు తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మెకు వెళ్తామని పేర్కొన్న సమయంలో కూడా ఆమె సమస్య పరిష్కరించడానికి తన వంతు ప్రయత్నం చేస్తానని చెప్పి సమ్మె విరమింపజేశారు.

గిరిజన తండాల్లో నిద్రలు చెయ్యాలని గవర్నర్ నిర్ణయం
ఇక ఇప్పుడు తాజాగా గిరిజన ప్రాంతాల్లో పర్యటించి, తండాల్లో నిద్ర చేయాలని నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ గవర్నర్ తమిళి సై. ఈ నేపథ్యంలో, గిరిజన సంక్షేమంపై రాజ్ భవన్ లో అధికారులతో సమావేశం అయిన ఆమె ములుగు లో ఏర్పాటు చేయబోయే గిరిజన యూనివర్సిటీ కి కేంద్ర క్యాబినెట్ నుండి అనుమతులు తీసుకురావడానికి తన వంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు. గిరిజన యువతను పారిశ్రామికవేత్తగా ఎదిగేలా ప్రోత్సహించడానికి అందరూ కృషి చేయాలని పేర్కొ న్నారు.

ప్రజా క్షేత్రంలోకి గవర్నర్ తమిళి సై
తెలంగాణా గవర్నర్ తమిళి సై గిరిజనుల అభ్యున్నతి కోసం తాను గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తానని తెలిపారు. రాజ్ భవన్ లో అధికారులతో గిరిజనుల సమస్యలపై చర్చలు జరిపిన తమిళి సై భద్రాచలం, నాగర్ కర్నూలు నుంచి వచ్చిన కోయ, లంబాడాలతో కలిసి నృత్యం చేశారు. గిరిజన సంక్షేమం కోసం ఆమె తండాలు సందర్శించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ నిర్ణయంతో ప్రజాక్షేత్రంలో ఆమె తనదైన దూకుడు చూపించబోతున్నారు అని తెలంగాణ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. రాజ్ భవన్ కు మాత్రమే పరిమితమవుతున్న గవర్నర్లు ఉంటున్న నేటి రోజుల్లో ప్రజల కోసం, ప్రజాక్షేత్రంలోకి వస్తున్న తెలంగాణ గవర్నర్ తమిళి సై తీసుకున్న తాజా నిర్ణయంపై గిరిజన సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications