ముస్లిం ఫకీరును ఎందుకు పూజిస్తున్నారు: సాయిపై గోవిందానంద వివాదస్పద వ్యాఖ్యలు
హైదరాబాద్ : ఇప్పటిదాకా సాయిబాబాపై వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ వస్తోన్న ద్వారక పీఠాధిపతి స్వరూపానంద సరస్వతికి తోడు ఇప్పుడు మరో మత గురువు సాయిపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
ఎంతో ఉన్నతమైన హిందూ ధర్మాన్ని వదులుకుని ఓ ముస్లింను, ఓ ఫకీరును పూజించే దుస్థితికి ఎందుకు దిగజారుతున్నారు? అంటూ ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త గోవిందానంద సరస్వతి వివాస్పద వ్యాఖ్యలు చేశారు. సాయి భక్తుల తీరును తప్పుబడుతూ.. పూజలు, పునస్కారాలతో ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని.. ఏ ఆధారాలతో సాయిబాబాకు దైవత్వం ఆపాదిస్తున్నారని గోవిందానంద ప్రశ్నించారు.
ధర్మానికి అపచారం జరిగే చోట ఖచ్చితంగా తాము ప్రశ్నిస్తామని గోవిందానంద స్పష్టం చేశారు. ధర్మాన్ని ఆచరించాలని తాము చెబతున్నామని, వేదాన్ని భ్రష్టుపట్టించాలని చూస్తే.. చూస్తూ ఊరుకోమని తెలిపారు. సాయి భక్తుల వల్ల గాయత్రీ మంత్రం కలుషితమైపోతుందన్నారు. ముస్లిం అయిన సాయిని హిందూ దేవతల రూపాల్లోకి ఎందుకు తీసుకుస్తున్నారంటూ ప్రశ్నించిన గోవిందానంద.. అసలు సాయికి ఎన్ని రూపాలున్నాయో చెప్పాలంటూ నిలదీశారు. శనివారం నాడు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన సందర్బంగా గోవిందానంద ఈ వ్యాఖ్యలు చేశారు.