ఆకుపచ్చ తెలంగాణ.!ఎంపీ సంతోష్ పిలుపుకు అనూహ్య స్పందన.!కేసీఆర్ పుట్టిన రోజున మొక్కల ఉప్పెన.!
హైదరాబాద్ : తెలంగాణ ఆకుపచ్చ తెలంగాణగా మారబోతోంది. ముఖ్యమంత్రి చంద్ర శేఖర్ రావు 67వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా కోటి మొక్కలు నాటే కార్యక్రమంలో తెలంగాణ మంత్రులు, నాయకులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బుదవారం సంతోష్ విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించిన వారిలో మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, ఈటల రాజేందర్, హరీష్ రావు ఉన్నారు. వీరు నాటిన మొక్కలన్నీ పెరిగితే ఆకుపచ్చ తెలంగాణ ఖాయమని పలువురు నాయకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
మొక్కల సునామీ.. ఉప్పెనాలా మొక్కలు నాటిన తెలంగాణ నాయకులు..
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినాన్ని పురస్కరించుకొని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆద్వర్యంలో బుధవారం జలవిహార్ లో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, కే.కేశవరావు, బడుగుల లింగయ్య యాదవ్ లు జలవిహార్ ఆవరణ లో మొక్కలను నాటారు. కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా కోటి మొక్కలు నాటి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకి కానుకగా అందిస్తామని రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పేర్కొన్నారు.
ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు.. సువర్ణాక్షరాలతో లిఖించదగిన సుపరిపాలన అంటున్న నేతలు..
అంతే కాకుండా సువర్ణాక్షరాలతో లిఖించదగిన సుపరిపాలనను అందిస్తున్న పాలనా దక్షుడు మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నెక్లెస్ రోడ్ లోని జలవిహార్ లో పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆద్వర్యంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అద్యక్షతన జరిగిన సభలో ముందుగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుపైన రూపొందించిన డాక్యుమెంటరీని విడుదల చేసారు.
నువ్వే ఒక చరిత్ర డాక్యుమెంటరీ విడుదల.. కేసీఆర్ ధీరత్వాన్ని వివరించిన బందూక్ లక్ష్మణ్
చంద్రశేఖర్ రావు బాల్యం, విద్య, రాజకీయ ప్రస్తానం, తెలంగాణా రాష్ట్ర సాధన ఉద్యమం నేపధ్యాన్ని వివరించేలా త్రీ డీ గ్రాఫిక్స్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో బందూక్ లక్ష్మణ్ దర్శకత్వంలో రూపొందించిన 30 నిమిషాల వ్యవధి కలిగిన డాక్యుమెంటరీ ( నువ్వే ఒక చరిత్ర ), కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రాముఖ్యతను వివరించే, రాష్ట్ర ప్రభుత్వం ఆద్వర్యంలో అమలు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు, కులవృత్తులను ప్రోత్సహించేలా ప్రభుత్వం అందిస్తున్న చేయూతను తెలియజేసే పాటలను శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు కేశవరావు లు విడుదల చేసారు.
కోటి మొక్కలు నాటే లక్ష్యం.. ఆకుపచ్చ తెలంగాణ ఖాయమంటున్న నాయకులు..
కోటి వృక్షార్చన లో భాగంగా రాష్ట్రంలోని గ్రామ గ్రామాన ఒక గంటలోనే కోటి మొక్కలు నాటడం అద్బుత కార్యక్రమం అని ఎర్రబెల్లి దయాకర్, మరో మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కూకట్ పల్లిలో సత్యవతి రాథోడ్ మొక్కలు నాటి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను వివరించారు. చంద్రశేఖర్ రావు నాయకత్వంలో తెలంగాణా ప్రభుత్వం చేపట్టిన చర్యలతో రాష్ట్రంలోని రైతులు అప్పుల ఊబి నుండి బయటపడి ఎంతో సంతోషంగా ఉందని మరో మంత్ర ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. కరోనా సమయంలో రాష్ట్రంలోని పేద ప్రజలకు ఉచితంగా బియ్యం, నగదు అందజేసిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకే దక్కుతుందని మంత్రులు అన్నారు.