వస్త్ర పరిశ్రమపై జీఎస్టీ పెంచడం దారుణం: కేంద్రమంత్రికి కేటీఆర్ లేఖ, మోడీపై సెటైర్లు
హైదరాబాద్: వస్త్ర పరిశ్రమపై జీఎస్టీని పెంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు తెలంగాణ మంత్రి కేటీఆర్. జీఎస్టీ కౌన్సిల్ ఇటీవల వస్త్ర పరిశ్రమపై జీఎస్టీని 7 శాతం పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని కేంద్ర జౌళిశాఖ మంత్రి పీయూష్ గోయల్కు లేఖ రాశారు. దేశ చరిత్రలో ఏనాడూ చేనేత ఉత్పత్తులపైన పన్నులేదని, కేంద్ర జీఎస్టీ ద్వారా మొదటిసారి 5 శాతం విధించిందని తెలిపారు. అప్పుడే చేనేత రంగం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైందన్నారు.
తాజాగా, ఇప్పుడున్న 5 శాతానికి మరో 7 శాతం కలిపి 12 శాతం జీఎస్టీ విధించారని మంత్రి కేటీఆర్ అన్నారు. చేనేత, వస్త్ర పరిశ్రమపై జనవరి ఒకటి నుంచి జీఎస్టీ పన్ను పెంపు అమలు చేయకుండా కేంద్రం విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే కరోనా ప్రభావంతో టెక్స్టైల్, చేనేత రంగాలు రెండేళ్లుగా తీవ్ర సంక్షోభంతో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని మంత్రి కేటీఆర్ వివరించారు.

ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న జీఎస్టీ 5 శాతం నుంచి 12 శాతానికి అంటే మరో ఏడు శాతం అదనంగా పెంచడం పరిశ్రమ చావుదెబ్బతీయడమే అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు కేటీఆర్. దేశంలో వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పించేది టెక్స్ టైల్, చేనేత పరిశ్రమలని.. ప్రస్తుత పరిస్థితుల్లో అదనపు ప్రయోజనాలు, ప్రోత్సాహాకాలు కల్పించి ఆదుకోవాల్సి ఉందన్నారు.
తెలంగాణలో అద్భుతమైన చేనేత చీరలకు ప్రసిద్ధిగాంచిందని కేటీఆర్ తెలిపారు. వస్త్ర పరిశ్రమపై జీఎస్టీ పెంపుపై వస్త్ర వ్యాపారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని అన్నారు. 2017, మే 18న జీఎస్టీ కౌన్సిల్ చేనేత ఉత్పత్తులపై ఎలాంటి పన్నులు లేకుండా ఉండాలని తీసుకున్న నిర్ణయాన్ని పునర్ పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ జీఎస్టీ పెంపు ప్రతిపాదనను విరమించుకోకుంటే.. చేనేత, పవర్ లూమ్ వ్యాపారులకు ప్రస్తుతం ఉన్న ట్యాక్స్ బేస్ జీఎస్టీ మినహాయింపును రూ. 20 లక్షల నుంచి రూ. 50 లక్షలకు పెంచాలని, తద్వారా లక్షలాది మంది చేనేత, వ్యారులకు ప్రయోజనం కలుగుతుందని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ఇది ఇలావుండగా, ప్రధాని నరేంద్ర మోడీపై కేటీఆర్ సెటైర్లు వేశారు. ఇటీవల వారణాసిలోని కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రారంభోత్సవం సందర్భంగా కూలీలతో కలిసి మోడీ భోజనం చేసిన దృశ్యాలను కేటీఆర్ ట్వీట్ చేశారు. వీటితో పాటు కరోనా లాక్డౌన్ సమయంలో వలస కూలీలు కాలినడకన వెళ్తున్న దృశ్యాలను కేటీఆర్ షేర్ చేశారు. ఈ రెండు ఘటనలను పోల్చుతూ మోడీ వైఖరిని కేటీఆర్ తప్పుబట్టారు.
ఎన్నికలు ఉంటే ఇలా.. కూలీలతో కలిసి భోజనం చేస్తారు. ఎన్నికలు లేకపోతే వలస కూలీలను గాలికొదిలేసి, ప్రత్యక్ష నరకం చూపించారు అని కేటీఆర్ పేర్కొన్నారు. కాశీ విశ్వనాథ్ కారిడార్ నిర్మాణ కూలీలపై మోడీ చూపించిన ప్రేమను చూస్తుంటే ఆశ్చర్యమేస్తోందన్నారు. లక్షల మంది వలస కార్మికులు కరోనా లాక్డౌన్లో వందల కిలోమీటర్లు నడిచినప్పుడే ఈ ప్రేమ ఎక్కడ పోయిందని ప్రశ్నించారు. వలస కూలీలను తమ స్వస్థలాలకు పంపించడానికి శ్రామిక్ రైళ్లను ఏర్పాటు చేసిన కేంద్రం బలవంతంగా ఛార్జీలను వసూలు చేసిందని కేటీఆర్ విమర్శించారు.
Wonder where this love & empathy was when millions of migrant workers were walking hundreds of kilometres
— KTR (@KTRTRS) December 19, 2021
In fact Govt of India coerced the states for train fares for shramik rails
ఎన్నికలు ఉంటే ఇలా.. కూలీలతో కలిసి భోజనం..లేకపోతే అలా.. వలస కూలీలను గాలికొదిలేసి, ప్రత్యక్ష నరకం pic.twitter.com/ycbozNXWtY