భ్రమపెడుతున్నారు: కెసిఆర్పై గుత్తా ఫైర్
హైదరాబాద్: అనాలోచిత నిర్ణయాలతో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అన్ని వర్గాల ప్రజలను వంచిస్తున్నారని నల్గొండ పార్లమెంట్ సభ్యులు, కాంగ్రెస్ నేత గుత్తా సుఖేందర్రెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆయన స్వగృహంలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావుతో కలిసి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆచరణకు సాధ్యంకాని హామీలు, కార్యక్రమాలు తీసుకోని ముఖ్యమంత్రి ప్రజలను భ్రమపెడుతున్నారని ఆయన విమర్శించారు.
రాత్రి కల వస్తే అదే చేస్తాం అన్న రీతిలో వ్యవహరిస్తున్నారని, కల వేరు ఆచరించడం వేరని ఆయన పేర్కొన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం 8నెలల పాలనలో ఏ ఒక్క ప్రజాసమస్య పరిష్కారం కాలేదని ఆయన అన్నారు. ఎస్సిలకు 3ఎకరాల భూపంపిణి పథకం కింద నియోజకవర్గంలోని ఒక గ్రామంలో నామమాత్రం ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే, ఆసరా పెన్షన్ల పథకం, రైతు రుణమాఫి, ఆహారభద్రత కార్డుల పంపిణి ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నాయని గుత్తా ఆరోపించారు.
ప్రభుత్వానికి ఏ సమస్యపై కూడా సరైన అవగాహన లేకుండా ఉందని ఆయన విమర్శించారు. సచివాలయం, చెస్ట్ ఆసుపత్రి తరలింపునకు వ్యతిరేకంగా గాంధీబవన్ నుంచి రాజ్భవన్వరకు శాంతియుతంగా టిపిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆధ్వర్యంలో పాదయాత్ర చేపడితే పోలీసులతో ప్రభుత్వం అరెస్ట్ చేయించిందని అన్నారు. ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేందుకు కాంగ్రెస్పార్టీ పాదయాత్ర చేస్తే ప్రభుత్వానికి కనువిప్పు కలగకపోగా మంత్రులు కెటిఆర్, హరీశ్రావులు అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని గుత్తా అన్నారు.
అధికారం శాశ్వతం కాదని, ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తేనే ప్రజల్లో ఉంటామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా కాంగ్రెస్పార్టీ ఉద్యమాలు చేసి రాష్ట్ర సాధనలో ప్రధాన భూమిక పోషించడం జరిగిందని, సోనియా వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం పద్దతులు మార్చుకోని వ్యవహరించాలని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వానికి నాగార్జునసాగర్ ఎడమకాల్వకు నీటివిడుదలపై స్పష్టమైన వైఖరి లేదని ఆయన విమర్శించారు.
ప్రభుత్వం నీటివిడుదలపై షెడ్యూల్ విడుదల చేయకపోవడం వలనే రైతులు నాట్లు వేసుకున్నారని, ఏప్రిల్ చివరి వరకు నీరు విడుదల చేస్తే తప్పా పంటలు చేతికిరావని ఆయన అన్నారు. నీరివ్వకపోతే రైతులు నష్టపోయి ఆత్మహత్యలకు ప్రభుత్వమే కారణమవుతుందని ఆయన అన్నారు. ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు మాట్లాడుతూ సాగర్ ఎడమకాల్వ కింద సేద్యం చేసినపంటలకు కాపాడేందుకు ఏప్రిల్ చివరి వరకు నీటివిడుదల చేయాలని ఆయన ్నారు.