కొట్టుకుంటున్నారనే, బాబు పేరు చెప్పి రేవంత్ని ఇరికించిన గుత్తా
నల్గొండ: తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట రెడ్డిలు నిత్యం తగువులాడుకుంటున్నారని, ఇలా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు చూడలేకనే తాను తెరాసలో చేరానని నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి మంగళవారం నాడు చెప్పారు.
కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి, ఉత్తమ్ నిత్యం కొట్టుకుంటున్నారని, తిట్టుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ నేతలు ఎవరికి కూడా తనను విమర్శించే నైతిక అర్హత లేదన్నారు. బంగారు తెలంగాణ కేసీఆర్ వల్లే సాధ్యమని, అందుకే కారు ఎక్కానని చెప్పారు.
అదే సమయంలో, తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి కూడా ఆయన కౌంటర్ ఇచ్చారు. పార్టీ మారిన గుత్తా, ఇతర ఇద్దరు ఎమ్మెల్యేలను సాంఘికంగా బహిష్కరించాలని రేవంత్ ఇటీవల నల్గొండ పర్యటనలో నిప్పులు చెరిగారు. అంతేకాదు, కేసీఆర్ రాజకీయ వ్యభిచారానికి తెరదీశారన్నారు.
దీనిపై గుత్తా స్పందించారు. తెలంగాణలో కేసీఆర్ తీరును విమర్శిస్తున్న రేవంత్ రెడ్డికి ఏపీలో చంద్రబాబు చేస్తున్న రాజకీయ వ్యభిచారం కనిపించడం లేదా అని ఎద్దేవా చేశారు. ఏపీలో ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్న చంద్రబాబు తప్పు చేస్తున్నట్లుగా రేవంత్ ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు.
అసలు రేవంత్ రెడ్డినే తెలంగాణలో సాంఘిక బహిష్కరణ చేయాలని విమర్శించారు. తెలంగాణలో ఆయనను తిరగనివ్వరాదన్నారు. సమయం వచ్చినప్పుడు తాను కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ద్వారా గెలిచిన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు.