రేవంత్ రెడ్డికి అందిన మోదీ సందేశం
Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు జన్మదిన వేడుకలను జరుపుకొంటోన్నారు. ఇది- 55వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. కొద్దిసేపటి కిందటే ప్రత్యేక హెలికాప్టర్లో యాదాద్రికి చేరుకున్నారు. ఇంకాస్సేపట్లో లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటారు.
దర్శనానంతరం ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహిస్తారు. ఆ తరువాత మిషన్ భగీరథలో భాగంగా నిర్మించదలిచిన పైప్లైన్ పనులకు శంకుస్థాపన చేస్తారు. పైలాన్ను ఆవిష్కరిస్తారు.

సిద్దిపేట్ జిల్లా మల్లన్న సాగర్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాలో 500 గ్రామాలకు మంచినీటిని అందించడానికి నిర్మించ తలపెట్టిన ప్రాజెక్ట్ ఇది. నిర్మాణ వ్యయం 210 కోట్ల రూపాయలు. మధ్యాహ్నం 2:10 నిమిషాలకు సంగెం వెళ్తారు రేవంత్ రెడ్డి. భీమలింగం వంతెన వరకు మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్రలో పాల్గొంటారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో పాదయాత్ర చేస్తారు.
పుట్టినరోజు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయురారోగ్యాలతో జీవించాలంటూ దీవించారు. సుఖ సంతోషాలతో ఉండాలంటూ అభిలాషిస్తున్నట్లు మోదీ తెలిపారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ అకౌంట్లో ఓ పోస్ట్ షేర్ చేశారు.
భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు, మాజీ ఉప ప్రధానమంత్రి లాల్ కిషన్ అద్వానీ పుట్టిన రోజు కూడా నేడే. 97వ సంవత్సరంలోకి అడుగు పెట్టారాయన. దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను అందుకున్న తరువాత ఆయన జరుపుకొంటోన్న మొదటి జన్మదిన వేడుకలు ఇవే.
ఈ సందర్భంగా ఆయనకు మోదీ జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ సంవత్సరం మరింత ప్రత్యేకమైనదని, దేశానికి విశిష్ట సేవలను అందించినందుకు భారతరత్న పురస్కారం లభించిందని గుర్తు చేశారు. ప్రజలు అమితంగా ఆరాధించే రాజనీతిజ్ఞుల్లో అద్వానీ ఒకరని, దేశాభివృద్ధి కోసం తనను తాను అంకితం చేసుకున్నారని కొనియాడారు మోదీ.












Click it and Unblock the Notifications