పంచాయతీ ఏపీ ప్రజలతో కాదు, బానిసత్వమేనా?: చంద్రబాబు, ఉత్తమ్లను ఏకేసిన హరీశ్
మెదక్: తమ పంచాయతీ తెలంగాణ, ఏపీ ప్రజల మధ్య కాదని.. తెలంగాణ అస్థిత్వాన్ని ప్రశ్నించే వలసాంధ్ర నాయకత్వంపైనేనని ఆపద్ధర్మ మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు అన్నారు. సోమవారం మెదక్లో ఆయన మీడియాతో మాట్లాడారు.
'సీమాంధ్రులకు అండగా' చక్కగా చెప్పారు: కేటీఆర్పై జేపీ ప్రశంసలు, ఏమన్నారంటే..?
బాబు ముందు ఉత్తమ్ చేతులు కట్టుకుని..
కాంగ్రెస్ నాయకులు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి పల్లకి మోసేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. ఏపీ భవన్లో చంద్రబాబు ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతులు కట్టుకుని నిలబడటాన్ని తెలంగాణ ప్రజలు సహించలేరన్నారు.
ప్రజలే బుద్ధి చెబుతారు
తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న అమరవీరుల లేఖలను త్వరలో బయటపెడతామన్నారు. ఆ లేఖల్లో చంద్రబాబుపై అమరలు ఏం రాశారో ప్రజలకు వివరిస్తామని హరీశ్ తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలు, ప్రాజెక్టులను వద్దంటున్న కాంగ్రెస్ నేతలకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.
కాంగ్రెస్ది బానిస మనస్తత్వం..
‘టీఆర్ఎస్కు ఓటేస్తే అభివృద్ధి పరంపర కొనసాగుతుంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలే టీఆర్ఎస్ మేనిఫెస్టో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు తెలంగాణ, ఏపీల్లో వేర్వేరు ప్రయోజనాలున్నాయి. బానిస మనస్తత్వంతో కాంగ్రెస్.. చంద్రబాబు పల్లకి మోసేందుకు సిద్ధమవుతోంది. అమరావతికి వెళ్లనిదే ఎల్ రమణ నిర్ణయాలు తీసుకునేలా ఉన్నాడా?' అని హరీశ్ ప్రశ్నించారు.
కేసీఆర్కు కానుకగా..
కాంగ్రెస్ జలయజ్ఞం పేరుతో పదేళ్లలో 5లక్షల ఎకరాలకు నీరందిస్తే.. నాలుగున్నరేళ్లలో తమ ప్రభుత్వం 12లక్షల ఎకరాలకు నీరు అందించిందని హరీశ్ రావు పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ గెలుపు ఖాయమని హరీశ్ ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి మెదక్లో మొత్తం 10సీట్లను గెలిచి కేసీఆర్కు కానుకగా ఇస్తామని చెప్పారు.