రేవంత్లాంటి వాళ్లను ఏం చేయాలి, కెసిఆర్ అంటే నమ్మలేదు: హరీష్
వరంగల్: ఏపీ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పైన తెలంగాణ మంత్రి హరీష్ రావు బుధవారం నాడు దుమ్మెత్తి పోశారు. ఇంకా టిడిపిలో ఉంటున్న తెలంగాణ నేతలను ఏం చేయాలని ప్రజలను అడిగారు. ఆయన వరంగల్ జిల్లా దేవరప్పులలో మిషన్ కాకతీయ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
సముద్రంలో కలుస్తున్న గోదావరి, కృష్ణా నీటిని మనం వాడుకునేందుకు ప్రాజెక్టులు కట్టుకుంటుంటే, వాటితో చంద్రబాబుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయట అని హరీష్ రావు మండిపడ్డారు. గోదావరి నదిలో 950 టీఎంసీల నీటిని వాడుకునే హక్కు తెలంగాణకు ఉందన్నారు.
టిడిపిలో ఉన్నవాళ్లను ఏం చేయాలి
మా హక్కుగా వచ్చే నీటిని వాడుకుంటామంటే చంద్రబాబుకు అంత బాధ ఎందుకు అని నిలదీశారు. చంద్రబాబు ఢిల్లీలో ఫిర్యాదులు చేయడం విడ్డూరమన్నారు. చంద్రబాబు అంటే ఆంధ్రా బాబు అని ఎప్పుడే తోలిపోయిందన్నారు. తెలంగాణలో ఇంకా టిడిపిలో ఉండటం విడ్డూరమన్నారు.
చంద్రబాబు తెలంగాణకు నీటిని అడ్డుకుంటుంటే రేవంత్ రెడ్డి, ఎల్ రమణ వంటి నేతలు ఇంకా ఆ పార్టీలో ఎందుకు ఉంటున్నారని ప్రశ్నించారు. మా బతుకు దెరువు కష్టమైనందున.. నీటిని తెచ్చుకుందామనుకుంటే చంద్రబాబు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.

తెలంగాణకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నప్పటికీ... ఇంకా టిడిపిలో ఉన్న రేవంత్ రెడ్డి వంటి వారిని ఏం చేయాలని ప్రశ్నించారు. ఏం చేయాలో మీ ఇష్టంని జనాన్ని ఉద్దేశించి అన్నారు. మనది ఎండిన కడుపుల బాధ, వారిది నిండిన కడుపు బాధ అన్నారు. వారికి మూడో పంట కోసం నీరు కావాలట అన్నారు.
తెలంగాణ ప్రాజెక్టులు అడ్డుకుంటుంటే తెలంగాణ టిడిపి నేతలు ఎందుకు నోరు మెదపడం లేదని హరీష్ రావు ప్రశ్నించారు. కెసిఆర్ గట్టి మనిషి అన్నారు. తెలంగాణ తెస్తానంటే ఎవరూ నమ్మలేదని, చెరువులు తెస్తానంటే ఎవరూ నమ్మలేదని.. కానీ ఆయన అన్నీ చేసి చూపిస్తున్నారన్నారు.
కేసీఆర్ దమ్మున్న ముఖ్యమంత్రి అన్నారు. ఇంటింటికి నల్లా నీరు ఇవ్వకుంటే మళ్లీ ఓటు అడగమని చెప్పే ధైర్యం ఎవరికి ఉందన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు కేసీఆర్ ప్రారంభించారన్నారు. ఇలాంటి కెసిఆర్కు మనమంతా మద్దతు ఇవ్వాలన్నారు.
తెలంగాణలో తెరాస తప్ప మరో పార్టీ ఉందా అన్నారు. ఖమ్మం అయినా, వరంగల్ అయినా, నారాయణ ఖేడ్ అయినా తెరాసనే అన్నారు. రేపు పాలమూరులోను తెరాసనే గెలుస్తుందన్నారు. తెలంగాణలో తెరాసకు తిరుగు లేదని చెప్పారు.












Click it and Unblock the Notifications