కళ్లు చెదిరేలా వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇంటీరియర్- ఓ లుక్కేయండి..!!
హైదరాబాద్: ఇంకో రోజు మాత్రమే మిగిలివుంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రతిష్ఠాత్మక వందే భారత్ ఎక్స్ప్రెస్ పరుగులు తీయనుంది. సంక్రాంతి పండగను పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈ రైలు అందుబాటులోకి రానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఉదయం 10 గంటలకు ఈ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు. దేశ రాజధాని నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సికింద్రాబాద్ స్టేషన్ లో ఈ రైలును ప్రారంభిస్తారు.

19 నుంచి ప్రీ పోన్..
నిజానికి- ఈ నెల 19వ తేదీన ఈ రైలును ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ.. అది ప్రీ పోన్ అయింది. ప్రధాని మోదీ స్వయంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఈ రైలును జెండా ఊపి ప్రారంభిస్తారంటూ మొదట్లో వార్తలొచ్చాయి. తొలుత ఈ కార్యక్రమం వాయిదా పడింది. ఈ నెలాఖరుకు షెడ్యూల్ అయినట్లు సమాచారం అందింది. అనూహ్యంగా రైల్వే మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని ప్రీ పోన్ చేసింది. సంక్రాంతి పండగ నాడే ముహూర్తాన్ని పెట్టింది.

వర్చువల్ గా..
అనంతరం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులను కూడా ఈ విధానంలోనే ప్రారంభిస్తారు ప్రధాని మోదీ. 690 కోట్ల రూపాయల వ్యయంతో ఈ రైల్వే స్టేషన్ ను ఆధునికీకరించే పనులకు మోదీ వర్చువల్ విధానంలోనే శంకుస్థాపన చేస్తారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా ఇప్పటికే ఏపీకి చేరుకుంది. ట్రయల్ రన్ పూర్తి చేసుకుంది. విశాఖపట్నంలో రాళ్లు విసిరిన ఘటనలో ఈ రైలు కిటికీ అద్దాలు పగిలిన విషయం తెలిసిందే.

వారంలో ఆరు రోజులు..
వారంలో ఆరు రోజుల పాటు ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ఆదివారం మినహా మిగిలిన అన్ని రోజుల్లోనూ సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగిస్తుంది. ఈ రైలు ప్రయాణం వల్ల ఎనిమిదిన్నర గంటల్లో సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి చేరుకోవచ్చని దక్షిణమధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు.

హాల్ట్ సౌకర్యం..
సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజూ విశాఖపట్నంలో ఉదయం 5.45 నిమిషాలకు బయలుదేరి మధ్యాహ్నం 2.15 నిమిషాలకు సికింద్రాబాద్ స్టేషన్ చేరుకుంటుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరి రాత్రి 11.30 నిమిషాలకు విశాఖపట్నానికి చేరుకుంటుంది. రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్ స్టేషన్లలో మాత్రమే ఈ రైలుకు హాల్ట్ సౌకర్యం కల్పించారు రైల్వే అధికారులు తెలిపారు.

ఇంటీరియర్..
రైలు ఇంటీరియర్ అద్దిరిపోతోంది. ఎరుపు, నీలం మిశ్రమంతో కుర్చీలను అమర్చారు అధికారులు. కిటికీ అద్దాలు విశాలంగా ఉంటాయి. ఇందులో స్లీపర్ సౌకర్యం ఉండదు. సీటింగ్ మాత్రమే అందుబాటులో ఉంది. ప్రయాణికుల సౌకర్యం కోసం సీటు ఎదురుగా ఓ టేబుల్, వాటర్ బాటిల్ హ్యాండల్ అమర్చారు. ర్యాక్ ఇన్ఫర్మేషన్ పొందు పరిచారు. ఒక్కో ర్యాక్ లో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయనేది ఈ ఛార్ట్ ద్వారా తెలుసుకోవచ్చు.

ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్..
ఈ రైలుకు ఉన్నవన్నీ ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్స్. వాటంతటవే తెరచుకుంటాయి. నిర్దేశిత సమయం పూర్తి కాగానే మళ్లీ మూసుకుంటాయి. ప్రస్తుతం ఈ తరహా వ్యవస్థ మెట్రో రైలులో మాత్రమే అందుబాటులో ఉంది. డోర్ మూసుకోకపోతే అక్కడే ఉన్న గ్రీన్ బటన్ ను ప్రెస్ చేయాల్సి ఉంటుంది ప్రయాణికులకు. అత్యవసర సమయంలో ర్యాక్ తలుపులు తెరచుకోవడానికి రెడ్ బటన్ ను అందుబాటులో ఉంచారు. ఏదైనా ఇబ్బందులు వస్తే- ఆ సమాచారాన్ని ట్రైన్ క్రూనకు తెలియజేయడానికి ఎమర్జెన్సీ టాక్ బ్యాక్ యూనిట్ ను ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications