హైదరాబాద్లో మరో దందా?: హవాలాతో వైట్ మనీగా వేలకోట్లు.. పోలీసులే షాక్?
:ఏటా 1000 కోట్ల రూపాయలు విదేశాలకు హవాలా రూపంలో తరలిపోతున్నాయని పోలీసులు గుర్తించారు.
హైదరాబాద్: హైదరాబాద్లో డ్రగ్స్ మాఫియా సృష్టించిన కలకలం మరవకముందే మరో దందా బయటపడింది. ఏటా వేల కోట్ల రూపాయాలను హవాలా మార్గంలో తరలిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. నకిలీ పత్రాలు సృష్టించి విదేశాలకు తరలిస్తున్న డబ్బును.. తిరిగి పెట్టుబడుల రూపంలో ఇండియాకు మళ్లిస్తున్నారు.
చందానగర్ హెచ్డీఎఫ్సి బ్యాంకు మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై విచారణ ప్రారంభించిన ఈడీ అధికారులకు నివ్వెరపోయే విషయాలు తెలియవచ్చాయి. ఏటా 1000 కోట్ల రూపాయలు విదేశాలకు హవాలా రూపంలో తరలిపోతున్నాయని పోలీసులు గుర్తించారు.
తాజా విచారణలో మహేష్ ఖత్రీ అనే వ్యాపారి రూ.31 కోట్లు విదేశాలకు తరలించినట్టు గుర్తించారు. స్నేహితులు, ఇతరుల పేర్ల మీద నకిలీ పత్రాలు తయారుచేసి ఆ డబ్బును విదేశాలకు తరలిస్తున్నట్లు తేల్చారు. ఇలా ఇప్పటి వరకు సుమారు రూ.150 కోట్లు విదేశాలకు హవాలా రూపంలో తరలినట్లు సమాచారం.
ఈ డబ్బుతో విదేశాల్లో పరిశ్రమలు స్థాపిస్తున్నట్లు భోగస్ పత్రాలు సృష్టించినట్లు గుర్తించారు. తిరిగి ఆ ఖాతాల్లోని డబ్బును పెట్టుబడుల రూపంలో ఇండియాకు మళ్లించి వైట్ మనీగా మారుస్తున్నట్లు నిర్దారించారు. బ్లాక్ మనీని వైట్ మనీగా మారుస్తున్న ఈ దందా వెనుక ఇంకా ఎవరి హస్తముందనేది తెలియరావాల్సి ఉంది.
ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న మహేష్ ఖత్రీకి స్టీల్ వ్యాపారి వినోద్ ఓఝా సహకరించినట్లు గుర్తించారు. వీరి వద్ద నుంచి చెక్కులు తీసుకుని నగదును ఆనంద్ కుమార్ అనే హవాలా వ్యాపారి సమకూర్చేవాడని ఈడీ అధికారులు చెబుతున్నారు.