హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం: రహదారులు జలమయం, ట్రాఫిక్ జామ్
హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ.. సాయంత్రం వరకు ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. హైదరాబాద్ నగరం మేఘావృతమై చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు వచ్చి చేరింది.
రాజేంద్రనగర్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. పాతబస్తీ, ఫలక్నుమా, చాంద్రాయణగుట్ట, బార్కస్, ఉప్పుగూడ, బహదూర్పురా, ఛత్రినాక తదితర ప్రాంతాల్లోనూ వాన దంచికొట్టింది. చందానగర్, మియాపూర్, కూకట్పల్లి, పటాన్చెరు, నానక్రామ్గూడ, శేరిలింగంపల్లి పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది.

కుండపోతగా కురుస్తున్న వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షం నీటిలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఒక్కసారిగా వర్షం కురవడంతో పాదచారులు, వాహనదారులు మెట్రో పిల్లర్ల కిందకు చేరారు. అయితే, గురువారం పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించింది.
కాగా, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో మరో తుఫాన్ ముంచుకురాబోతోంది. ఈ అల్పపీడనం క్రమేణ బలపడి తుఫాన్గా మారనుంది. దీంతో 40 కిలోమీటర్ల వేగంతో కన్యాకుమారి, బంగాళాఖాతం ఆగ్నేయ మధ్య ప్రాంతాల్లో గాలులు వీస్తాయన్నారు. తుఫాన్ హెచ్చరకలతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే కురిసిన అకాల వర్షాలతో రైతులు పెద్ద ఎత్తున పంటలు నష్టపోయారు. మళ్లీ వర్షాలు కురుస్తుండటంతో ఆవేదన చెందుతున్నారు.
మరోవైపు, తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి.
దక్షిణ, మధ్య, తూర్పు తెలంగాణ జిల్లాలైన ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సంచాలకులు నాగరత్న తెలిపారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని సూచించారు. వర్షంలో బయటకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications