తెలంగాణకు అలర్ట్.. మరో రెండు రోజులు దంచికొట్టనున్న వానలు !
తెలంగాణకు వాతావరణ శాఖ మరోసారి అలర్ట్ ప్రకటించింది. రుతుపవన ద్రోణి ప్రస్తుతం ఆగ్నేయ దిశలో ఈశాన్య బంగాళాఖాతం వరకు కొనసాగుతోంది. అందుకు అదనంగా దక్షిణ ఒడిశా-ఉత్తర ఆంధ్ర సముద్రతీర ప్రాంతంలో సముద్రమట్టం నుండి 4.5 కి.మీ ఎత్తు వరకు చక్రవాత ఆవర్తనం కొనసాగుతుంది. మరోవైపు ఉపరితల చక్రవాతం అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ప్రభావంతో తెలంగాణలో వర్షపాతం పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఈ మేరకు ఈ రోజు (సెప్టెంబర్ 12, 2025) నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.

అలానే రేపు కూడా (సెప్టెంబర్ 13) నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, నల్లగొండ, సూర్యాపేట, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని స్పష్టం చేశారు. కాబట్టి ప్రజలు తప్పనిసరిగా వాతావరణ శాఖ సూచనలను గమనించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
రాబోయే నాలుగు రోజులపాటు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల అధిక వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉరుములు-మెరుపులు, ఈదురుగాలులు కూడా వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ పలు సూచనలు జారీ చేసింది.
వాతావరణ శాఖ సూచనలు..
పిడుగులు పడే అవకాశమున్న సమయంలో రైతులు పొలాల్లో పనులు చేయవద్దని హెచ్చరించింది.
టెంట్లు, చెట్లు, లోహ నిర్మాణాల కింద నిలబడకూడదని సూచించింది.
విద్యుత్ స్తంభాలు, నీటితో నిండిన ప్రదేశాలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు.
వరద నీటిలో వాహనాలు నడపకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు తెలిపారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రత్యేకించి ఉత్తరకోస్తాలోని విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కాకినాడలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.












Click it and Unblock the Notifications