ఎంగిలి ప్లేట్లు తీసిన న్యాయమూర్తి: న్యాయవాదులు తిని పడేసిన వాటిని: హైకోర్టు ప్రాంగణంలోనే..!
ఆయన తన హోదా..అధికారం పక్కన పెట్టేసారు. పిలిస్తే పని చేసిపెట్టే మనుషులను కాదన్నారు. తర అధికార దర్పాన్ని పక్కన పెట్టేసారు. సామాజిక బాధ్యత చాటి అందరికీ ఆదర్శ ప్రాయంగా నిలిచారు. హై కోర్టు న్యాయమూర్తిగా ఉన్నా.. ఇప్పుడు ఆయన చేసిన పనిలో అంతకంటే గొప్ప వ్యక్తిగా మారిపోయారు. స్వయంగా ఎంగిలి ప్లేట్లు ఎత్తారు. హైకోర్టు న్యాయమూర్తి చల్లా కోదండరాం సహచర న్యాయ అధికారులు.. న్యాయ వాదులు..సిబ్బంది అక్కడే ఉండగా చేసిన ఆ పని అందరినీ కదలించింది. స్వయంగా ఆయన ఎంగిలి ప్లేట్లు ఎత్తటం చూసి అప్పటి వరకు ప్రేక్షక పాత్రకే పరిమితమైన సిబ్బంది చివరకు ఆయనతో కలవక తప్పలేదు. ఆయన చేస్తున్న పని..దాని వెనుక పరమార్ధం అర్ధం చేసుకున్న న్యాయవాదులు సైతం ఆయనతో కలిసి ప్లేట్లను తీసారు. ఈ అరుదైన ఘటనకు హైకోర్టు వేదికగా నిలిచింది.
ఎంగిలి ప్లేట్లు తీస్తూ..న్యాయమూర్తి ఇలా..
తెలంగాణ హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సంజయ్కుమార్ వీడ్కోలు కార్యక్రమం జరిగింది. న్యాయవాదులు పెద్ద సంఖ్యలో వచ్చారు. అందరూ టీ తాగారు.. బిస్కెట్లు.. సమోసాలు తిన్నారు. ఎప్పటి లాగే ప్లేట్లు అక్కడే పడేసి వెళ్లిపోయారు. ఇదంతా గమనిస్తున్న జస్టిస్ చల్లా కోదండరామ్కు మనసు చివుక్కుమంది. న్యాయవాదులుగా బాధ్యతాయుతమైన వృత్తిలో ఉండి ఇలా ఎక్కడపడితే అక్కడ, అది కూడా హైకోర్టు ప్రాంగణాన్ని అపరిశుభ్రంగా మార్చడాన్ని భరించలేకపోయారు.
వెంటనే స్వయంగా వచ్చి ఈ ప్రదేశం మొత్తం తిరుగుతూ న్యాయవాదులు పడేసిన ఎంగిలి ప్లేట్లను ఎత్తడం ప్రారంభించారు. మొదట్లో న్యాయవాదులకు ఆయన ఏం చేస్తున్నారో అర్థం కాలేదు. ఆ తర్వాత ఎంగిలి ప్లేట్లు తీస్తున్నారని అర్థం చేసుకున్న న్యాయవాదులు వారు ఆయనతో పాటు ప్లేట్లను తీయడం ప్రారంభించారు. హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు సూర్యకరణ్రెడ్డి కూడా జస్టిస్ కోదండరామ్తో కలిసి ఈ ప్లేట్లను తీయటంలో భాగస్వాములయ్యారు.

జస్టిస్ కోదంరాం పై ప్రశంసలు..
హైకోర్టు న్యాయమూర్తిగా ఉంటూ..పిలిస్తే పలికే పనిమనుషులు సిద్దంగా ఉన్నా..ఆయన వారిలో స్పూర్తి నింపటం కోసమే ఈ విధంగా వ్యవహరించారనే అభిప్రాయం అక్కడి న్యాయవాదుల్లో వ్యక్తం అయింది. మనం రోజు పని చేసే కార్యాలయం శుభ్రంగా ఉంచుకోవాలనే ఆలోచన మిగిలిన వారికి స్పూర్తిని పెంచింది.
తాము తిన్న ప్లేట్లను అలాగే వదలియటం..పక్కన పడివేయటం కారణంగానే స్వయంగా హైకోర్టు న్యాయమూర్తి హోదాలో ఉన్న వ్యక్తి స్పందించాల్సి వచ్చిందనే భావన వారిలో కలిగింది. దీంతో..అక్కడ జరిగిన పొరపాటు ఏంటో గ్రహించారు. తాను ఏం చేయదలచుకున్నారో మాటల ద్వారా కాకుండా.. చేతలతోనే చెప్పిన న్యాయమూర్తి చల్లా కోదండరాం ఇప్పుడు వార్తల్లో నిలిచారు. దీని పైన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి కరంగా చెప్పుకోవటం మొదలైంది.












Click it and Unblock the Notifications