చీకోటి ప్రవీణ్ భద్రత - హైకోర్టు కీలక ఆదేశాలు..!!
క్యాసినో వ్యవహారంలో సంచలనంగా మారిన చీకోటి ప్రవీణ్ వినతి పై హైకోర్టు సానుకూలంగా స్పందించింది. ఈడీ విచారణ ముగిసే వరకు తనకు పోలీసు భద్రత కల్పించాలని చీకోటీ ప్రవీణ్ కోరారు. ఈ మేరకు హైకోర్టును అభ్యర్దించారు. దీనిని పరిగణలోకి తీసుకోవాలని నగర్ పోలీసు కమిషనర్ కు న్యాయస్థానం సూచించింది. చీకోటి ప్రవీణ్ పిటిషన్పై ఇవాళ రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది. ఈడీ విచారణ సమయంలో పలువురు సినీ..రాజకీయ ప్రముఖుల పేర్లు బయటకు వచ్చినట్లుగా ప్రచారం జరిగింది.
అయితే, కోర్టులో ప్రవీణ్ దాఖలు చేసిన పిటీషన్ లో తాను రాజకీయ నేతల పేర్లు బయట పెట్టానని తప్పుడు ప్రచారం జరుగుతోందని,దీంతో తన కుటుంబానికి ముప్పు ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేసారు. దీంతో పాటుగా తన ఇంటి వద్ద కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నారని ప్రవీణ్ తన పిటీషన్ లో పేర్కొన్నారు.తనతో పాటుగా తన కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాలని ఇప్పటికే పోలీసులను కోరినట్లు వివరించారు. కానీ, పోలీసుల నుంచి స్పందన రాలేదన్నారు.
దీంతో..ప్రవీణ్ వాదనలు విన్న హైకోర్టు ప్రవీణ్ దరఖాస్తును వారంలో పరిగణనలోకి తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించింది. కొద్ది రోజుల క్రితం ఈడీ కేసినో వ్యవహారంలో ప్రవీణ్ తో పాటుగా మరి కొందరి నివాసాల్లో సోదాలు చేసింది. ఆ సమయంలో కీలక అధారాలు సేకరించింది. అందులో భాగంగా.. మనీ లాండరింగ్ జరిగిందనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ప్రవీణ్ ఎవరితో లావా దేవీలు నిర్వహించారనే అంశం పైన ఆరా తీసారు. హవాలా మార్గంలో ద్రవ్యమారకం జరిగినట్టు ప్రాథమిక ఆధారాలు లభించడంతో దీని వెనుక ఎవరెవరు ఉన్నారని ఈడీ లోతుగా విచారిస్తోంది.
చీకోటి ప్రవీణ్, దాసరి మాధవరెడ్డి ఆర్ధిక వ్యవరాలపైనా ఈడీ అధికారులు ఆరా తీసారు. వారి బ్యాంకు ఖాతాలు పరిశీలించారు. హవాలా జరిగిట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో..ఈడీ ప్రవీణ్ ను సుదీర్ఘంగా విచారించింది. ఇప్పుడు కోర్టు పోలీసు శాఖకు ఇచ్చిన ఆదేశాలతో భద్రత పైన నిర్ణయం తీసుకోనున్నారు.