చంద్రబాబుకు ఎదురెళ్లి స్వాగతం పలికిన కెసిఆర్, యాగంలో ఏపీ సీఎం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం ఉదయం పదిన్నర గంటలకు ఎర్రవెల్లికి చేరుకున్నారు. తెలంగాణ సీఎం కెసిఆర్ నిర్వహిస్తున్న ఆయుత చండీయాగానికి ఆయన హాజరయ్యారు.
చంద్రబాబు విజయవాడ నుంచి హెలికాప్టర్ ద్వారా ఎర్రవెల్లి చేరుకున్నారు. చంద్రబాబు వెంట కేంద్రమంత్రి సుజనా చౌదరి, ఇతర మంత్రులు ఉన్నారు. చండీయాగం నేపథ్యంలో చంద్రబాబు బెజవాడ నుంచి కనకదుర్గమ్మ వారి చీర, కుంకుమ ప్రసాదాలను తీసుకు వచ్చారు.
కెసిఆర్తో కలిసి యాగంలో పాల్గొన్న చంద్రబాబు
ఆయుత చండీయాగానికి హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం కెసిఆర్తో కలిసి యాగంలో పాల్గొన్నారు. చంద్రబాబు యాగశాలకు రాగానే కెసిఆర్ ఎదురు వెళ్లి స్వాగతం పలికారు. చంద్రబాబు సంప్రదాయ దుస్తుల్లో యాగంలో పాల్గొన్నారు.
తాను విజయవాడ నుంచి తెచ్చిన అమ్మవారి చీర, కుంకుమలు చంద్రబాబు ఇచ్చారు. అంతకు ముందు బాబుకు తెలంగాణ మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్లు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. చంద్రబాబు వెంట సుజనా చౌదరి, కెఈ కృష్ణమూర్తి, గంటా శ్రీనివాస రావులు ఉన్నారు.
చండీయాగంలో నాగార్జున
కేసీఆర్ నిర్వహిస్తున్న అయుత మహా చండీయాగం చూసేందుకు ప్రముఖులు, సామాన్యులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. సినీ నటుడు నాగార్జున, ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్లు కూడా శనివారం యాగానికి విచ్చేశారు.
అనంతరం వీరిద్దరూ సంప్రదాయబద్ధంగా ఎరుపు రంగు పంచె, కండువా ధరించి యాగశాలలో కూర్చున్నారు. ఈ ఉదయం తమిళనాడు గవర్నర్ రోశయ్య, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, కాంగ్రెస్ నేత టి సుబ్బరామి రెడ్డి తదితరులు వచ్చారు.
రేపు వేములవాడకు కెసిఆర్ దంపతులు
అయుత చండీయాగం ముగిసిన తర్వాత కేసీఆర్ వేములవాడ పర్యటనకు వెళ్లనున్నారు. కేసీఆర్ కుటుంబ సమేతంగా సోమవారం రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని, ప్రత్యే కపూజలు చేస్తారు. ఆదివారం నాడు కెసిఆర్ చండీయాగం నిర్వహించిన చోటే నిద్రించనున్నారు. అక్కడే నిద్రిస్తేనే యాగఫలం ఉంటుందని చెబుతున్నారు. ఈ కారణంగా కెసిఆర్ యాగశాలలో నిద్రించనున్నారు.