పదవీ విరమణ రోజే పోలీస్ శాఖపై సంచలన ఆరోపణలు చేసిన సిఐ దాసరి భూమయ్య ..
ఎవరైనా ఉద్యోగ విరమణ సమయంలో తన ఉద్యోగ జీవితంలో వారు సాగించిన ప్రయాణాన్ని, పడిన ఇబ్బందుల్ని గుర్తు చేసుకుని, వాటిని తాను ఎలా అధిగమించారో చెప్తూ సహ ఉద్యోగుల సమక్షంలో సంతోషంగా రిటైర్మెంట్ ఫంక్షన్ చేసుకుంటారు. కానీ పోలీస్ శాఖలో సీఐగా పనిచేసి రిటైర్ అయిన కరీంనగర్ జిల్లాకు చెందిన భూమయ్య తన ఉద్యోగ జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను, పోలీస్ శాఖ లో జరుగుతున్న దారుణాలను ప్రెస్ మీట్ పెట్టి మరి మీడియా ముందు చెప్పారు.

ఐపిఎస్ అధికారుల భార్యలు ప్రభుత్వ వాహనాలను వాడటం ప్రజాధనం దుర్వినియోగం కాదా అన్న భూమయ్య
తెలంగాణ రాష్ట్రంలో పోలీసు శాఖలోని కొందరు అధికారుల తీరుపై రిటైర్డ్ సిఐ దాసరి భూమయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐపిఎస్ అధికారుల భార్యలు ప్రభుత్వ వాహనాలను వాడుతున్నారని, మారుమూల గిరిజన ప్రాంతాలలో మహిళలు కనీసం ఆసుపత్రికి వెళ్లడానికి ఆంబులెన్స్ కూడా లేని పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నారని, కానీ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి అధికారుల భార్యలకు ప్రభుత్వ వాహనాలు ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ దీనిపై దృష్టి సారించాలని కోరారు రిటైర్డ్ సిఐ దాసరి భూమయ్య.
తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించిన దాసరి భూమయ్య పోలీసు శాఖలో నిజాయితీగా పనిచేసినందుకే తనపై అక్రమంగా ఏసీబీ కేసు నమోదు చేశారని ఆరోపించారు. కావాలని కుట్రపూరితంగా తను కేసులో ఇరికించారని పోలీసు ఉన్నతాధికారులపై ఆరోపణలు గుప్పించారు. 2018లో ఆదిలాబాద్ ట్రాఫిక్ సీఐగా పనిచేసిన సమయంలో దాసరి భూమయ్య రూ.10 లక్షల నగదుతో ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. భూమయ్య కారులో తనిఖీల్లో రూ.10 లక్షల నగదు, 17 ఎకరాల భూమి కొనుగోలుకు సంబంధించి రూ.15 లక్షలు ఇచ్చినట్లుగా రాసిన పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటన్నింటికీ సరైన ఆధారాలు చూపించకపోవడంతో అక్రమార్జన కింద గుర్తిస్తూ భూమయ్యపై క్రిమినల్ మిస్కండక్ట్ కింద కేసు నమోదు చేశారు.

అధికారులను ప్రశ్నించానని వేధింపులకు గురి చేశారన్న రిటైర్డ్ సిఐ భూమయ్య
తెలంగాణ ఉద్యమ సమయంలో తాను అధికారులను నిలదీస్తే జమ్మికుంట నుంచి పోస్టింగ్ తీసేశారని ఆయన చెప్పారు. ఇక ఆ తరువాత నుండి తనను వేధింపులకు గురి చేస్తున్నారని ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిస్తే తనకు హుస్నాబాద్ లో పోస్టింగ్ ఇచ్చారని ఆయన చెప్పారు.
తనను ఐపిఎస్ అధికారి శివకుమార్ వేధించారని ఆరోపించిన భూమయ్య , తనలాగా పోలీస్ శాఖలో చాలామంది ఉద్యోగులు బయటకు చెప్పలేక ఉన్నతాధికారుల వల్ల ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు . తనను టార్గెట్ చేసి కొందరు హుస్నాబాద్ పోలీసులు స్టేషన్ లోని ఎకె 47, 9 ఎంఎం కార్బన్ తుపాకులు ఎత్తుకు వెళ్లారని, ఇప్పటి వరకు ఈ వ్యవహారంలో సంబంధిత అధికారులపై చర్యలు లేవని ఆయన ఆరోపించారు. హుస్నాబాద్ పోలీసు స్టేషన్ లో అదృశ్యమైన రెండు తుపాకులు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు.

దాసరి భూమయ్య వ్యాఖ్యలతో పోలీసు శాఖలో చర్చ .. ప్రభుత్వం స్పందిస్తుందా?
దాసరి భూమయ్య చేసిన వ్యాఖ్యలతో పోలీసు శాఖలో కలకలం రేగింది. ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో సంచలనం కాగా , ఇప్పుడు దాసరి భూమయ్య చేసిన వ్యాఖ్యలు పోలీస్ శాఖలో కలకలం గా మారాయి.
పోలీస్ శాఖలో ఉన్నతాధికారులు పోలీసు వాహనాలను తమ వ్యక్తిగత అవసరాలకు వాడుకోవడం చాలా సందర్భాలలో చర్చనీయాంశం అవుతున్నా , దీనిపై శాఖాపరమైన చర్యలు మాత్రం లేవు. ప్రస్తుతం దాసరి భూమయ్య వ్యాఖ్యలతో అయినా తెలంగాణ ప్రభుత్వం స్పందిస్తుందని చాలా మంది పోలీసు శాఖలోని కిందిస్థాయి అధికారులు ఎదురుచూస్తున్నారు. మొదటినుంచి పోలీస్ శాఖలో ఏది జరిగినా మీడియా ముందు మాట్లాడితే డిపార్ట్మెంట్ పరంగా యాక్షన్ తీసుకుంటారన్న భయంతోనే ఎవరు ఎప్పుడూ మాట్లాడలేదు. ఇక తాజాగా రిటైర్మెంట్ అవుతున్న సందర్భంగా దాసరి భూమయ్య తన విషయంలో పోలీస్ శాఖలో జరిగిన అంశాలను పూసగుచ్చినట్టు చెప్పి ఇప్పుడు తెలంగాణ సమాజంలో చర్చకు కారణమయ్యాడు.












Click it and Unblock the Notifications