నా రాజీనామా తర్వాతే కొత్త పథకాలు -సీఎంవోలో ఒక్క దళితుడూ లేడు -కేసీఆర్పై ఈటల ఫైర్
ఎన్నికల్లో లబ్ధి కోసం కచ్చితంగా ప్రభుత్వ పథకాలు అమలు చేస్తామని, ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు ప్రయోజనం చేకూరాలనే హుజూరాబాద్లో దళిత బంధు పెట్టామనేది వందకు వంద శాతం నిజమని, గెలవాలంటే ఏ పార్టీకైనా ఇలాంటివి తప్పవని ముఖ్యమంత్రి కేసీఆర్ బాహాటంగా ప్రకటన చేసిన నేపథ్యంలో మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు..
టీఆర్ఎస్ కు తాను రాజీనామా చేసిన తర్వాతే హుజూరాబాద్ కు కొత్త పథకాలు వస్తున్నాయని ఈటల రాజేందర్ అన్నారు. కేవలం హుజూరాబాద్ నియోజకవర్గంలోనే పెన్షన్లు ఇస్తున్నారని, రాష్ట్రంలోని అందరికీ పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నానని ఆయన చెప్పారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని, దళితులకు మూడెకరాల భూమిని ఇస్తానని చెప్పిన కేసీఆర్... సీఎం అయిన తర్వాత మాట తప్పారని విమర్శించారు. దళితులను కేసీఆర్ మోసం చేశారని అన్నారు. మరోసారి..

దళితుల్ని మరోసారి మోసం చేయడానికే సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని తెచ్చాడని ఈటల మండిపడ్డారు. సీఎం కార్యాలయంలో ఒక్క దళిత అధికారి కూడా లేరని, గతంలో రాజయ్యకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి లాక్కున్నారని మాజీ మంత్రి గుర్తుచేశారు. రాష్ట్రంలోని దళితులందరికీ రూ. 10 లక్షల చొప్పున ఇవ్వాలని ఈటల డిమాండ్ చేశారు. కాగా,
ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందే హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల పాదయాత్ర చేస్తుండటం తెలిసిందే. తన పాదయాత్ర జరిగే ప్రాంతాల్లో ప్రభుత్వం కరెంటు తీయిస్తోందని, టీఆర్ఎస్ అహంకారాన్ని ఓడగొట్టే శక్తి హుజూరాబాద్ ప్రజలకు మాత్రమే ఉందని, ఇన్నేళ్ల తన రాజకీయ ప్రస్థానంలో ఒక్క తప్పు కూడా చేయలేదని రాజేందర్ అన్నారు. కాగా, వీణవంక మండలం ఎలబాక గ్రామంలో ప్రజలు ఈటల రాజేందర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈటల పంపిన గోడగడియారాలను గ్రామస్తులు పగలకొట్టారు. ఈటల తమ గ్రామములో ఏమాత్రం అభివృద్ధి చేయలేదని కేసీఆర్ కే తమ ఓటు వేస్తామంటూ నినాదాలు చేశారు. ఇల్లందకుంటలోనూ ఈటలకు ఇలాంటి అనుభవమే ఎదురైంది.












Click it and Unblock the Notifications