అదే జరిగితే కేసీఆర్ను బండకేసి కొట్టుడు ఖాయం-ఎన్ని డబ్బులిచ్చినా తీసుకోండి-కుట్రలను చేధించండి :ఈటల
హుజురాబాద్ ఉపఎన్నికలో ఓడిపోతామనే భయంతో టీఆర్ఎస్ నికృష్ఠమైన... ఛండాలమైన పద్దతులు అవలంభిస్తోందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ విమర్శించారు. దమ్ముంటే,ధైర్యం ఉంటే మీ కార్యాచరణ ఏంటో చెప్పుకుని ప్రజలను ఓట్లు అడగాలని టీఆర్ఎస్ను ఉద్దేశించి పేర్కొన్నారు. 2006లో కరీంనగర్ లోక్సభ ఉపఎన్నికలో ఆనాటి అధికార పార్టీ వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఉద్యమ నాయకుడు కేసీఆరే గెలిచారని... నిర్బంధాన్ని ప్రజలు పాతరేశారని గుర్తుచేశారు. ఇప్పుడు హుజురాబాద్ ప్రజలు కూడా అదే చేయబోతున్నారని చెప్పారు.
Recommended Video

దళిత బంధు లాగే వారికీ ఇవ్వాలి : ఈటల రాజేందర్
'హుజురాబాద్ను గుత్త పట్టారా... మనుషులమా బానిసలమా... పిచ్చి పనులు మంచివి కాదు. దళితులతో పాటుగా బీసీల్లోనూ సంచార జాతులైన వడ్డెరలు,ఎరకలు,పెద్దమ్మలు,బుడగ జంగాలు,గంగిరెద్దులు,పూసలోళ్లు... అలాగే మత్స్యకారుల్లో,గౌడల్లో,పద్మశాలిల్లోనూ పేదలు ఉన్నారు. గుంట భూమి లేక రెక్కల కష్టాన్ని నమ్ముకునే విశ్వకర్మలు ఉన్నారు. వీరికి కూడా దళిత బంధు లాగే ఇంటికి రూ.10లక్షలు చొప్పున ఇవ్వాలి. ఒకవేళ దళిత బంధు పేరుతో రూ.10లక్షలు ఇచ్చినట్లే ఇచ్చి... కలెక్టర్ల పెత్తనం పెట్టి,దాన్ని పేపర్లకే పరిమితం చేస్తే... నిన్ను బండకేసి కొట్టుడు ఖాయం. దానిపై సంపూర్ణ అధికారం దళితులకే ఉండాలి. ఇతర కులాలకు ఇస్తే ఆ కులాలకే దానిపై సంపూర్ణ అధికారం ఉండాలి. ప్రజలను తాత్కాలిక మోసం చేసి ఓట్లు దండుకుని పోతామంటే ఇక్కడ వెర్రి బాగులవారు లేరు. హుజురాబాద్ ప్రజలారా అన్నీ గమనించండి. ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి... వాళ్లేమీ మన మీదే ప్రేమతో ఇస్తలేరు... ప్రేమతో ఇస్తే తెలంగాణ అంతటా ఇవ్వాలి.. కానీ అలా జరగట్లేదు... ఉపఎన్నిక ఉంది కాబట్టే హుజురాబాద్లో ఇస్తున్నారు. అన్నీ గమనించి కుట్రలను చేధించాలని వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా.' అని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

దళితులను బెదిరిస్తున్నారు : ఈటల రాజేందర్
హుజురాబాద్ ప్రజల మీద టీఆర్ఎస్ తోడేళ్లలా విరుచుకుపడి జుగుప్సాకరంగా వ్యవహరిస్తోందని ఈటల రాజేందర్ విమర్శించారు.బీజేపీ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ నేతలు ఎక్కడికి వెళ్లినా,ఎవరిని కలిసినా ఇంటలిజెన్స్ నిఘా పెడుతున్నారని ఆరోపించారు. ఒకరకంగా తెలంగాణలో బీజేపీని నిషేధిత పార్టీలా చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు ఏ స్థాయికి వచ్చారంటే... అనధికారికంగా ఒక్కొక్క పీఎస్లో ఒక డీఎస్పీ,పదుల సంఖ్యలో పోలీసులను పెట్టారని అన్నారు. ఇంటలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ నేత్రుత్వంలో వందల సంఖ్యలో పోలీసులు గ్రామాల్లో తిరుగుతున్నారని చెప్పారు. ఎవరైనా యువకులు బీజేపీ కండువా కప్పుకుని కనిపిస్తే... వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తున్నారని... ప్రభుత్వ పథకాలు రావని బెదిరిస్తున్నారని ఆరోపించారు. దళితులంతా మూకుమ్మడిగా టీఆర్ఎస్కు ఓటు వేస్తేనే దళిత బంధు పథకం వస్తుందని బెదిరిస్తున్నట్లు ఆరోపించారు.

కేంద్రానికి ఫిర్యాదు...
'కేసీఆర్ ఇచ్చే రైతు బంధు,ఫించన్లు,రేషన్ కార్డులు... ఇవేమీ కేసీఆర్ కూలీ చేసి తీసుకొచ్చిన సొమ్ము కాదు.లేదా కేసీఆర్ తాత సంపాదించిన ఆస్తి కాదు, తన పార్టీ ఫండ్ నుంచి ఇవ్వట్లేదు. ఇదంతా ప్రజల సొమ్మే ప్రజల సొమ్మును ప్రజలకు పంచడంలో పార్టీల ప్రకారం,జెండాల ప్రకారం పంచడం ఉండదు.కానీ ఆ మూర్ఖపు తత్వాన్ని కేసీఆర్ అమలుచేస్తున్నాడు.అందుకే హుజురాబాద్ ప్రజలు అసహ్యించుకుంటున్నారు. వెనుకట నువ్వు నక్సలైట్ పార్టీకి అన్నం తీసుకుపోయినవటా... చీటి తీసుకుపోయినవటా కదా అని పోలీసులు బెదిరించేవారు. ఇప్పుడు బీజేపీతో తిరిగేవాళ్లను అలాగే బెదిరిస్తున్నారు. పోలీసుల తీరు,నిఘాపై ఇప్పటికే కేంద్ర హోంమంత్రికి నివేదిక పంపించాం. దీనిపై మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేస్తాం. హైకోర్టులోనూ కేసు వేస్తాం.' అని ఈటల రాజేందర్ తెలిపారు.

నన్ను ఓడించేందుకే దళిత బంధు...: ఈటల
'రేపు హుజురాబాద్లో దళిత బంధు ప్రారంభోత్సవం జరగబోతున్నది. ఆ పథకాన్ని మేము స్వాగతిస్తున్నాం. ప్రతీ దళిత కుటుంబానికి దాన్ని అమలుచేయాలని కోరాం. కేవలం హుజురాబాద్ దళిత ఓట్ల మీద ప్రేమతో కాకుండా దళితుల ఆకలి కేకలు దూరం చేసేందుకు దాన్ని అమలుచేయాలంటున్నాం. కానీ ఊరికి 10 మందిని ఎంపిక చేయడం,అందులోనూ స్థానికులు కానివారిని,కాస్తో కూస్తో ఉన్నవారిని,పార్టీ జెండా కప్పుకున్నవారికే ఇస్తున్నారు. విధి విధానాలు లేకుండా అమలుచేస్తున్నారు. దీనిపై హుజురాబాద్లో అన్ని దళిత వాడలు భగ్గుమన్నాయి. ఊరేగింపులు తీసి,కేసీఆర్కు శాపనార్థాలు పెట్టారు. ఈటల రాజేందర్ను ఓడించే ఉద్దేశంతోనే కపట పద్దతిలో ఈ స్కీమ్ పెట్టారని ప్రజలే అంటున్నారు. రేపు కేసీఆర్ మీటింగ్ ఉందని ఎక్కడికక్కడ బీజేపీ నేతలను అరెస్టులు చేస్తున్నారు. కేవలం బీజేపీ కార్యకర్తలనే కాకుండా,చైతన్యవంతమైన దళిత నాయకులను అరెస్టు చేస్తున్నారు. ఏ చట్టం ప్రకారం మీరు అరెస్టులు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నాం. మీ మీటింగ్లో ఏమైనా గడబిడ చేస్తే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసినవారికి కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వకుండా ఇబ్బందిపెడుతున్నారు. దీనిపై కూడా మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేస్తాం. ప్రశాంత వాతావరణం భగ్నం కాకూడదని మేము ఓపిక పడుతున్నాం. బేషరతుగా అరెస్ట్ చేసినవారందరినీ విడుదల చేయాలి.

రేపు హుజురాబాద్కు కేసీఆర్...
హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ సోమవారం(ఆగస్టు 16) లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇందుకోసం హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట మండలం శాలపల్లి గ్రామంలో బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ పాల్గొనబోయే ఈ సభ ఏర్పాట్లను మంత్రి హరీష్ రావు, సీఎస్ సోమేశ్ కుమార్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.హుజురాబాద్లో దళిత బంధు తొలి లబ్ధిదారులుగా 15 మందిని ఎంపిక చేయనున్నారు. లబ్ధిదారుల ఎంపికపై కరీంనగర్ జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఆదివారం(ఆగస్టు 15) ముఖ్యమంత్రి కేసీఆర్కు జిల్లా కలెక్టర్ కర్ణన్ ఈ జాబితాను పంపించనున్నారుఆగస్టు 16న శాలపల్లి గ్రామంలో జరగనున్న సభలో వారికి సీఎం కేసీఆర్ స్వయంగా వారికి దళిత బంధు చెక్కులను అందజేయనున్నారు. అయితే విధివిధానాలు ఖరారు చేయకుండా దళిత బంధు అమలుచేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలనే లబ్ధి దారులుగా ఎంపిక చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications