Huzurnagar by election results 2019: స్థానిక బలం చూపించిన సైదిరెడ్డి ..కేసీఆర్ లెక్క ఇదేనా !!
Recommended Video
హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఫలితంలో దూకుడు చూపిస్తున్న శానంపూడి సైదిరెడ్డి విజయం సాధిస్తారని అంచనాలతోనే సీఎం కేసీఆర్ మరోమారు ఆయనకు టికెట్ కన్ఫర్మ్ చేశారు. ఇక అందుకు శానంపూడి సైదిరెడ్డి కెసిఆర్ లెక్కలు, అంచనాలు కారణం. హోరాహోరీగా జరిగిన ఈ పోరులో తాజా ఎన్నికల ఫలితాలను బట్టి కెసిఆర్ లెక్క తప్పలేదు అని అర్థమవుతుంది. అసలు ఇంతకీ కెసిఆర్ లెక్కలు ఏంటంటే
హుజూర్ నగర్ లో ఆ నిర్ణయమే కాంగ్రెస్ ను ముంచిందా: బాధ్యులెవరు: కారుకు కలిసొచ్చిందవే..!
సైదిరెడ్డి విజయంపై కేసీఆర్ లెక్క
శానంపూడి సైదిరెడ్డి.. సూర్యాపేట జిల్లా గుండ్లపల్లి గ్రామానికి చెందిన సైదిరెడ్డిది మొదటి నుండి రాజకీయ నేపథ్యమున్న కుటుంబమే. ఆయన తండ్రి గుండె పల్లి సర్పంచ్ గా పనిచేసి మంచి పేరు ప్రతిష్టలు సంపాదించారు. ఇక సూర్యాపేట జిల్లాలో భారీ బంధుగణం ఉంది. అంతేకాదు గత స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన సైదిరెడ్డి బంధువులు ఆయనకు పెద్ద ఎత్తున మద్దతు అందిస్తారన్న విశ్వాసం బలంగా ఉండడం, గత ఎన్నికల్లో అతి తక్కువ మెజార్టీతో సైదిరెడ్డి ఓటమి పాలు కావడం వంటి అంశాలు ఈసారి టిఆర్ఎస్ పార్టీకి లభిస్తాయని భావించారు గులాబి బాస్ కెసిఆర్.
స్థానిక బలం చూపించిన సైదిరెడ్డి
ఇక అనుకున్నట్టే శానంపూడి సైదిరెడ్డి ఈసారి తనకున్న స్థానిక బలాన్ని చూపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన తన బంధుగణం సంపూర్ణ మద్దతుతో ఆయన హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో చక్రం తిప్పారు. చింతలపాలెం జడ్పిటిసి చెన్నారెడ్డి చంద్రకళ సైదిరెడ్డి కి స్వయానా సోదరి కావటం, అలాగే చింతలపాలెం 1 ఎంపీటీసీ సైదిరెడ్డి కి స్వయానా బావ కావటంతో వీరు ఈ ఎన్నికల్లో సైదిరెడ్డి కి మద్దతునిచ్చారు.విజయం సాధించడానికి తమ వంతు కృషి చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బంధువుల విజయం లాభించిన అంశం
ఇక మఠంపల్లి మండలం లోని పెదవీడు 2 ఎంపిటిసి కుందూరు వెంకటరెడ్డి స్వయాన సైదిరెడ్డి కి చిన్నమ్మ కుమారుడు .మఠంపల్లి మండల కేంద్ర సర్పంచ్ మన్యం శ్రీనివాస్ రెడ్డి సైదిరెడ్డి మేనమామ ఇక రఘునాధపాలెం జడ్పిటిసి సైదిరెడ్డి కి దగ్గరి బంధువు. ఇలా ఎక్కడ చూసినా సైదిరెడ్డి దగ్గర బంధువుల గెలవడంతో స్థానిక సంస్థలలో తన బంధుగణం సాధించిన విజయం సైదిరెడ్డి కి ఎన్నికల్లో ఎంతగానో ఉపయోగపడింది. దీంతో సైదిరెడ్డి స్థానిక బలం చూపించినట్లుగా తాజా కౌంటింగ్ లెక్కలు తేల్చి చెబుతున్నాయి.
అధికార పార్టీ అయితేనే అభివృద్ధి .. ప్రచారంలో సక్సెస్
అంతేకాదు పార్టీ శ్రేణులు సమన్వయం చేసుకోవడం లోనూ, అధికార పార్టీని ఎన్నుకుంటే అభివృద్ధికి ఆస్కారం ఉంటుందనే విషయం ఓటర్లకు తెలియజేయడం లోనూ పక్కా ప్రణాళికతో వ్యవహరించారు శానంపూడి సైదిరెడ్డి. గత ఎన్నికల్లో కేవలం ఏడు వేల పైచిలుకు ఓట్లతో ఓటమిపాలైన ఆయన ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలతో ప్రణాళికాబద్ధంగా, వ్యూహాత్మకంగా, రాజకీయ సామాజిక సమీకరణాలను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ ముందుకు సాగారు.
నిజముతున్న సీఎం కేసీఆర్ అంచనా
హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టిపిసిసి ఉపాధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య అయిన పద్మావతిని వెనక్కినెట్టి ముందుకు దూసుకుపోతున్నారు. ఇక సీఎం కేసీఆర్ అంచనా వేసినట్టు ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేయడం,గత ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ చేసిన లోటుపాట్లను సరిదిద్దుకోవడం పార్టీకి లభించాయి. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన సైదిరెడ్డి బంధుగణం మద్దతు ఇవ్వడంతో స్థానిక బలం చూపించిన శానంపూడి సైదిరెడ్డి హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం లో ముందుకు దూసుకుపోతున్నారు.