స్విమ్మింగ్ ఫూల్లో పడి పదేళ్ల బాలుడి మృతి: నిర్వాహకుడి అరెస్ట్, సీజ్ చేసిన అధికారులు
హైదరాబాద్: వేసవి సెలవుల్లో సరదాగా స్విమ్మింగ్ ఫూల్కు వెళ్లిన బాలుడు మృతి చెందడం నాగోల్లో కలకలం రేపుతోంది. ఆదివారం స్విమ్మింగ్ ఫూల్లో పడి పదేళ్ల మనోజ్ అనే బాలుడు మృతి చెందాడు. దీంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అదే సమయంలో ఈ స్విమ్మింగ్ ఫూల్కు అనుమతులు కూడా లేవని జీహెచ్ఎంసీ తేల్చడం గమనార్హం. దీంతో బ్లూ ఫ్యాబ్ స్విమ్మింగ్ ఫూల్ ను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు.
బాలుడికి ఈత నేర్పించేటప్పుడు కనీస జాగ్రత్తలు కూడా తీసుకోలేదు నాగోల్ సమతాపురి కాలనీలోని బ్లూఫ్యాబ్ స్విమ్మింగ్పూల్ నిర్వాహకులు. దీంతో నీళ్లలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు పదేళ్ల మనోజ్. లింగంపల్లిలో ఉండే మనోజ్.. వేసవి సెలవులు కావడంతో నాగోల్లోని అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. సమతాపురి కాలనీలోని బ్లూఫ్యాబ్ స్విమ్మింగ్పూల్లో ఈత నేర్చుకునేందుకు వెళ్లి నీటిలో మునిగిపోయాడు. తోటి స్విమ్మర్లు అతడ్ని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
నాగోల్లోని బ్లూ ఫ్యాబ్ స్విమ్మింగ్పూల్లో పడి.. బాలుడు మృతి చెందిన ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. స్విమ్మింగ్ పూల్ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే.. పదేళ్ల బాలుడు మృతి చెందినట్లు తేల్చారు. స్విమ్మింగ్ ఫూల్ నిర్వాహకుడు అశోక్ను అరెస్టు చేశారు.
ఉస్మానియా ఆస్పత్రిలో సోమవారం బాలుడి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించనున్నారు. తమ కుమారుడు మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు మృతుడి తల్లిదండ్రులు. స్విమ్మింగ్ ఫూల్ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగానే మనోజ్ ప్రాణాలు కోల్పోయాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిందితులను శిక్షించడంతోపాటు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
పుష్కరిణిలో మునిగి బాలిక మృతి
యాదగిరిగుట్టలో విషాద ఘటన చోటు చేసుకుంది. యాదాద్రి పుష్కరిణిలో పుణ్యస్నానానికి దిగిన బాలిక నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయింది. కొండకింద లక్ష్మీపుష్కరిణిలో ఈ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ నగరానికి చెందిన రోజాగా ఆ బాలికను గుర్తించారు. బాలిక మృతితో పుష్కరిణిలో భక్తుల స్నానాలు నిలిపివేశారు. సంప్రోక్షణ అనంతరం స్నానాలకు అనుమతిస్తామని తెలిపారు.