నడిరోడ్డుపై దారుణ హత్య: కారులోంచి లాగి వ్యక్తిని నరికిచంపారు, ఎస్ఐ సస్పెండ్
హైదరాబాద్: నగరంలోని చాంద్రయాణగుట్టలో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్థానిక పోలీస్ స్టేషన్(సౌత్ జోన్)కు కూతవేటు దూరంలోనే ఓ వ్యక్తిని దారుణంగా కత్తులతో నరికి చంపారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడిని పాతబస్తీ బర్కస్కి చెందిన హమీద్ బిన్ ఆల్ జుబేదీ(37)గా గుర్తించారు.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ పాతబస్తీ బర్కస్కి చెందిన వ్యక్తి హమీద్ బిన్ ఆల్ జుబేది వెస్టర్న్ యూనియన్ ఆఫ్ మనీ నిర్వహిస్తున్నాడు. బుధవారం హమీద్ బండ్ల గూడా ప్రధాన రహదారిపై కారులో వెళ్తుండగా.. రోడ్డు మీద కొందరు గుర్తు తెలియని దుండగులు కారు ఆపి మరణయుధాలతో దాడి చేశారు.
కారులో వెళ్తున్న హమీద్ను బండ్లగూడా వద్ద ముగ్గురు వ్యక్తులు అడ్డగించి కత్తులతో దాడి చేసి అక్కడి నుంచి పారిపోయారు. వారిని అడ్డుకునేందుకు స్థానికులు గానీ, అక్కడేవున్న పోలీసులు కానీ ధైర్యం చేయలేకపోయారు. ఘటనపై స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన హమీద్ ని 108లో ఉస్మానియా ఆసుపత్రి కి తరలించారు.
అయితే అప్పటికే వైద్యులు హమీద్ చనిపోయాడని నిర్ధారించారు. ఈ ఘటనపై చంద్రయన్ గుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక లావాదేవీల కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులుగా భావిస్తున్న ముగ్గురు సోదరులపై కేసు నమోదు చేసినట్లు సౌత్ జోన్ డీసీపీ గజ్ రావు భూపాల్ తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయని తెలిపారు.
ఎస్ఐపై వేటు
విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన చాంద్రయాణగుట్ట పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేశారు హైదరాబాద్ కమిషనర్ అంజనీకుమార్. కాగా, పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే ఈ హత్య జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. మరణించిన హమీద్ తనకు ప్రాణహాని ఉందని పోలీసులు ఫిర్యాదు చేసినప్పటికీ.. ఎస్ఐ వెంకటేష్ పట్టించుకోలేదని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఎస్ఐ వెంకటేష్ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ ఎస్ఐ పట్టించుకొని ఉంటే.. ఈ హత్య జరిగి ఉండేది కాదని పలువురు అభిప్రాయపడ్డారు.