కరోనా దోపిడీ: 11 రోజులకు 11 లక్షల బిల్లు, ప్రాణం పోయినా.. మరో 3 లక్షలకు ప్రైవేటు ఆస్పత్రి డిమాండ్
హైదరాబాద్: కరోనా మహమ్మారి బారినపడి అనేక మంది ప్రాణాలు కోల్పోతుంటే.. మరోవైపు కొన్ని ఆస్పత్రులు మాత్రం ఆర్థిక దోపిడీకి పాల్పడుతన్నాయి. కరోనా బారినపడి ప్రాణభయంతో వస్తున్న బాధితులను ఆర్థికంగా దోచుకుంటున్నాయి. అయితే, బాధితుల ప్రాణాలు పోయినా.. వారి నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తుండటం శోచనీయం. హైదరాబాద్ నగరంలోని దిల్సుఖ్నగర్లో తాజాగా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.
కరోనాతో ప్రైవేటు ఆస్పత్రిలో చేరితే.. ఫీజుల మోతే..
వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఎర్ణం శ్రీధర్(38) కరోనా బారినపడ్డారు. తీవ్రత పెరగడంతో హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చారు. వెంటిలేటర్, ఆక్సిజన్ సౌకర్యం ఉన్న దిల్సుఖ్నగర్లోని ఆయుష్ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిలో మే 5న చేర్పించారు. అప్పటి నుంచి రోజుకు రూ. 85వేల ఫీజు చొప్పున మే 16 వరకు చెల్లించామని, ఇక మందుల కోసం మరో రూ. 20వేల చొప్పున చెల్లించామని బాధితుడి కుటుంబసభ్యులు చెప్పారు.
ప్రాణం పోయినా.. ఫీజు ఇవ్వాల్సిందే..
అయినా, ఆస్పత్రి వైద్యులు శ్రీధర్ ప్రాణాలు కాపాడలేకపోయారని మృతుడు శ్రీధర్ సోదరి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు రూ. 10 లక్షలపైనే బిల్లు కట్టినా.. ఇప్పుడు ఇంకా రూ. 3.5 లక్షలు కడితేనే మృతదేహాన్ని అప్పగిస్తామని ఆస్పత్రి యాజమాన్యం చెబుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. రెండు రెమిడిసివిర్ ఇంజెక్షన్లకు ఒక్కొక్కటి రూ. 50వేల చొప్పున, ప్లాస్మాకు రూ. 30వేలు ఆస్పత్రి యాజమాన్యం వసూలు చేసిందని చెప్పారు. జూనియర్ వైద్యులతో చికిత్స నిర్వహిస్తున్నారని, ఐసీయూ కూడా అధ్వాన్నంగా ఉందని ఆరోపించారు.
ప్రభుత్వ నిర్ణయించిన ఫీజులు ఎక్కడ?
ఈ ఘటనపై ఆస్పత్రి సీఈవో ప్రమోద్ స్పందిస్తూ.. తాము డబ్బుల కోసం వేధించలేదన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కరోనా నుంచి కోలుకుంటుండగా.. ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో శ్రీధర్ మృతి చెందారని తెలిపారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, ఏదో గొడవ జరుగుతోందని ఆస్పత్రి వద్దకు వచ్చామని మలక్పేట పోలీసులు తెలిపారు.
కాగా, ప్రభుత్వం కరోనా చికిత్సకు గరిష్ట ధరలు నిర్ణయించినప్పటికీ... కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు మాత్రం అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. సీఎం కేసీఆర్ సోమవారం కరోనాపై ఉన్నతస్థాయి సమీక్షలో మాట్లాడుతూ.. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి డబ్బులు పోగొట్టుకోవద్దని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని సదుపాయాలు ఉన్నాయని తెలిపిన విషయం తెలిసిందే.