జీవో 550 అమలు చేయొచ్చు, పూర్తైన వైద్యవిద్య ప్రవేశాల్లో జోక్యమొద్దంటూ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం
న్యూఢిల్లీ: హైదరాబాద్ హైకోర్టు ఉత్తర్వులను కొట్టివేసిన సుప్రీంకోర్టు.. వైద్య, విద్యా ప్రవేశాల్లో ఇప్పటికే పూర్తయిన కౌన్సెలింగ్లో జోక్యం చేసుకోవద్దని ఆదేశించింది. ఇక నుంచి చేపట్టే ప్రవేశాల్లో జీవో 550ని యథావిధిగా అమలు చేయొచ్చని సూచించింది.
జీవోలోని పేరా 5(2) న్యాయసమ్మతమే అయినా ఆన్లైన్ కౌన్సెలింగ్లో దానిని సక్రమంగా అమలుచేయలేరని అభిప్రాయపడింది. సాంకేతికతతో స్లైడింగ్ చేసినప్పటి నుంచే సమస్యలు వస్తున్నాయని, కౌన్సెలింగ్ను మాన్యువల్గా చేపట్టాలని సూచించింది.
గురు, శుక్రవారాల్లో కేసును విచారించిన జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఇందిరా బెనర్జీల ధర్మాసనం ఈ జీవోపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేస్తూ మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. సోమవారం రాతపూర్వకంగా ఉత్తర్వులు వెలువరిస్తామని పేర్కొంది. సమస్యను హైకోర్టు సరిగా అర్థంచేసుకోలేకపోయిందని, జీవోలోని పేరా5 (2) నిబంధన మాన్యువల్ కౌన్సెలింగ్లోనే సాధ్యమవుతుందని ఈసందర్భంగా జస్టిస్ అరుణ్మిశ్రా వ్యాఖ్యానించారు.
వైద్య, విద్యా ప్రవేశాల్లో జనరల్ కేటగిరీ నుంచి సీటు సాధించిన రిజర్వుడు విద్యార్థి.. తన రిజర్వేషన్ కోటాలో మెరుగైన కళాశాలను ఎంచుకుంటే అతడు ఖాళీచేసిన సీటును అదే రిజర్వేషన్ కేటగిరీ విద్యార్థితో నింపాలనే జీవో550లోని పేరా5(2) నిబంధనను ఇటీవల హైకోర్టు కొట్టివేసింది. దీన్ని సవాలుచేస్తూ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు, విద్యార్థులు తదితరులు సుప్రీంను ఆశ్రయించారు.
ఇది ఇలా ఉండగా, జీవో 550లోని పేరా 5(2)ను రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని హైకోర్టును అభ్యర్థిస్తూ దాఖలైన వ్యాజ్యంపై విచారణ మంగళవారానికి వాయిదా పడింది. హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టు రద్దు చేసిందని పునఃసమీక్ష పిటిషనరు తరఫు న్యాయవాది సుధీర్ శుక్రవారం ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దానిని అధ్యయనం చేసేందుకు విచారణను వాయిదా వేయాలని కోరారు. దీంతో ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్, జస్టిస్ వి.రామసుబ్రమణియన్లతో కూడిన ధర్మాసనం విచారణ మంగళవారానికి వాయిదా వేశారు.