ఏఐ కేపిటల్ గా బెంగళూరు నంబర్ వన్: ప్రతి నలుగురిలో ఒకరికి గట్టి పట్టు.. !!
భారత్ లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) నేర్చుకోవాలనే ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. ప్రముఖ ఎడ్టెక్ విద్యా సంస్థ 'స్కేలర్’ తాజాగా విడుదల చేసిన 'ఇండియా ఏఐ వర్క్ఫోర్స్ రిపోర్ట్ 2026’ అధ్యయనం దీనికి సంబంధించిన కీలక డేటాను విడుదల చేసింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పై శిక్షణ, వాటి టూల్స్ వినియోగం, దీనిపై ఉండే అవగాహన వంటి అంశాల ఆధారంగా ఈ రిపోర్ట్ రూపుదిద్దుకుందిప
దీని ప్రకారం.. దేశంలో ఏఐ నైపుణ్యాలను నేర్చుకుంటున్న వారిలో బెంగళూరు టాపర్ గా నిలిచింది. మిగిలిన నగరాలతో పోట్చుకుంటే ఇక్కడ అత్యధికంగా 19 శాతం మంది ఏఐ పట్ల అవగాహనను కలిగివున్నారు. దీనిపై మరింత పట్టు పెంచుకోవడానికి ప్రాధాన్యత ఇస్తోన్నారు. ప్రతి నలుగురిలో ఒకరికి దీనిపై మంచి అవగాహన, పట్టు ఉందని ఈ నివేదిక వివరించింది.

బెంగళూరు తర్వాత వరుసగా పుణె, హైదరాబాద్, ముంబై, చెన్నై ఉన్నాయి. ఏఐ నేర్చుకోవడానికి ప్రాధాన్యత ఇస్తోన్న నగరాల్లో మొదటి అయిదు స్థానాల్లో నిలిచాయి. కీలక ఏఐ నైపుణ్య కేంద్రాలుగా ఆయా నగరాలు అవతరించాయి. ఈ మెట్రో నగరాల వెలుపల కూడా ఏఐ శిక్షణ పట్ల విస్తృత అవగాహన ఇప్పుడిప్పుడే కలుగుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏఐ కోర్సులు నేర్చుకునే ప్రతి అయిదుమందిలో ఒకరు లక్నో, జైపూర్, పాట్నా, ఇండోర్, కోయంబత్తూరు, నాగ్పూర్ వంటి టయర్-2 నగరాల నుంచి వస్తుండడం గమనార్హం.
పెరుగుతున్న ఏఐ ఆదరణ
ఇంతకుముందు ఏఐ అనేది ఐటీ నిపుణులు లేదంటే సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు మాత్రమే పరిమితం అనే అభిప్రాయం ఉండేది. ప్రస్తుతం మారిన పరిస్థితులలో విభిన్న పరిశ్రమలకు చెందిన ఉద్యోగులు తమ ప్రొడక్టివిటీని మెరుగుపరుచుకోవడానికి ఏఐ టూల్స్ వినియోగిస్తున్నారు. వ్యాపారంలో అగ్రస్థానాన్ని అందుకోవడానికి, కెరీర్లో వేగంగా ఎదగడానికి ఈ నైపుణ్యాలు ఉపయోగపడుతున్నాయి. దీంతో ఏఐ శిక్షణ తీసుకుంటున్న వారిలో చాలామంది నాన్ టెక్నికల్ ఎంప్లాయిస్ అధికంగా ఉన్నట్లు ఈ నివేదిక పేర్కొంది.
ఏఐ ఆధారిత కెరీర్ ఫలితాలలో దాదాపు 50 శాతానికి పైగా లీడర్షిప్, కన్సల్టింగ్, హెచ్ఆర్, మార్కెటింగ్, ఫైనాన్స్, విద్యా విభాగాలు వంటి వ్యవస్థాగత పాత్రలలోనే కనిపిస్తున్నాయి. అభ్యర్థులలో దాదాపు 25 శాతం మంది నాన్-టెక్నికల్ నేపథ్యం నుంచి వచ్చినవారే కావడం విశేషం. వివిధ వృత్తిపరమైన విభాగాలలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అత్యధికంగా 34.77 శాతంతో ముందుండగా, ఇంజినీరింగ్ లీడర్షిప్ 17.51 శాతంతో రెండో స్థానంలో నిలిచాయి.
ఉద్యోగాల కోత కాదు.. సరికొత్త అవకాశాల సృష్టి
సాధారణంగా ఏఐ రాకతో ఉద్యోగాలు కోల్పోతారనేది ఎప్పటి నుంచో ఉన్న అభిప్రాయం. అందుకు భిన్నమైన వాస్తవాన్ని ఈ నివేదిక వెల్లడించింది. స్కేలర్ సహ వ్యవస్థాపకుడు అభిమన్యు సక్సేనా తెలిపిన వివరాల ప్రకారం.. ఏఐ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకునే నిపుణులకు నూతన కెరీర్ అవకాశాలను సృష్టించి మంచి వేతనాలు లభించేలా తోడ్పడుతుందని వివరించారు. ఈ నూతన సాంకేతిక సాధనం ఉద్యోగుల పురోగతికి ఊతమిచ్చే శక్తిగా నిలుస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.
చిన్న నగరాల నుంచి వచ్చే నిపుణులు, మహిళా ఉద్యోగుల భాగస్వామ్యం ప్రతి ఏటా దేశవ్యాప్తంగా బలపడుతోంది. ఒక నిర్దిష్ట విభాగానికో లేదా ఐటీ రంగానికో పరిమితం కాకుండా, ప్రతి రంగంలోనూ మార్పులను తీసుకొచ్చే సాధనంగా ఏఐ రూపాంతరం చెందుతోంది. భవిష్యత్తులో ఈ సాంకేతికత నైపుణ్యాల ప్రజాస్వామ్యీకరణకు మరింత దోహదపడనుందని స్పష్టమవుతోంది.












Click it and Unblock the Notifications