ప్రశాంతంగా ముగిసిన మునావర్ ఫరూఖీ కామెడీ షో: వచ్చినవారిని వచ్చినట్లు అరెస్ట్
హైదరాబాద్: ఆద్యాంతం ఉద్రిక్తత పరిస్థితుల మధ్య ప్రారంభమైన వివాదాస్పద స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ కామెడీ షో చివరకు ప్రశాంతంగా ముగిసింది. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. పలు హిందూ సంస్థలు, బీజేపీ నేతలు మునావర్ షోను అడ్డుకుంటామని చెప్పిన నేపథ్యంలో కార్యక్రమం జరిగిన శిల్ప కళావేదిక వద్ద భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. అక్కడికి వచ్చిన బీజేపీ నేతలను అరెస్ట్ చేశారు.
అంతేగాక, కార్యక్రమం జరుగుతున్న ఆడిటోరియంలో కూడా టికెట్ బుక్ చేసుకున్నవారితో సమానంగా పోలీసులు కూడా ఉండటం గమనార్హం. శనివారం సాయంత్రం 5 గంటల తర్వాత ప్రారంభమైన మునావర్ కామెడీ షో.. దాదాపు రెండు గంటలపాటు సాగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. స్టేజీపైకి ఎవరూ రాకుండా చూశారు.

బీజేపీ కార్యకర్తలు కూడా టికెట్లు తీసుకుని షోకి వచ్చి ఆటంకం కలిగించవచ్చనే ఉద్దేశంతో పోలీసులు నిఘా పెట్టారు. అనుమానం వచ్చిన వారిని ప్రశ్నించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసు యూనిఫాంలో వచ్చిన ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
అయితే, ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు లేకుండా మునావర్ ఫారూఖీ కామెడీ షో ముగించినట్లు తెలిసింది. బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో మునావర్ శిల్పా కళా వేదికకు చేరుకున్నారు.
కాగా, కార్యక్రమానికి ముందే అక్కడికి వచ్చిన వాళ్లను వచ్చినట్టు అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు పోలీసులు. కొందరు మహిళా కార్యకర్తల్ని కూడా అరెస్టు చేశారు. హిందూ దేవుళ్లను అవమానించే మునావర్ షోను అడ్డుకుంటామని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ హెచ్చరించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications